Indian Railways: దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్కు లైన్ క్లియర్.. త్వరలో పట్టాలపై పరుగులు.. ఈ ఫీచర్లు చూస్తే అబ్బురపోవాల్సిందే..
దేశంలో తొలి హైడ్రోజన్ రైలుకు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే పట్టాలెక్కేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. శుక్రవారం ఈ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది.

దేశంలో స్వచ్ఛమైన, పర్యావరణహితమైన రైలు ప్రయాణం దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు పడింది. భారతీయ రైల్వే తాజాగా తొలి హైడ్రోజన్ రైలుకు ఆమోదం తెలిపింది. హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించగా.. ఇది విజయవంతంగా పూర్తయింది. గంటకు 120 కిలోమీటరల్ వేగంతో దీనిని పరీక్షించారు. మిగతా పనులు పూర్తయిన తర్వాత త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య దీనిని నడపనుండగా.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన, శక్తివంతమైన హైడ్రోజన్ రైలుగా దీనిని చెబుతున్నారు. దీంతో హైడ్రోజన్ రైళ్లను తీసుకొచ్చిన జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ కూడా చేరింది.
హైడ్రోజన్ రైలు ఫీచర్లు
ఈ రైలులో పది కోచ్లు ఉంటాయి. 1,200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్తో నడుస్తుంది. గంటకు 75 కిలోమీటర్ల వరకు వాణిజ్య వేగంతో ప్రయాణిస్తుంది. అయితే గంటకు 120 కిలోమీటర్ల వేగం వరకు ట్రయల్ రన్లు నిర్వహించారు. ఈ రైలు సెట్లో రెండు డ్రైవింగ్ పవర్ కార్లు ఉండగా.. ఒక్కొక్కటి 1,200 kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మిగిలిన ఎనిమిది కోచ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్ లోపల హైడ్రోజన్ నిల్వ సిలిండర్లు, ఫ్యూయల్ సెల్ వ్యవస్థలు, బ్యాటరీలు, నియంత్రణ వ్యవస్థలను ఉంచడానికి ప్రత్యేక స్థలాలు ఉంటాయి.
ఒక్కసారి ఇంధనం నింపితే..
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో ఈ ట్రైన్ పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ ద్వారా హైడ్రోజన్తో కూడిన రసాయన చర్య ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. కేవలం గాలిలోని నీటి ఆవిరి, వేడి వల్ల ఉత్పత్తి అవుతుంది. అందువల్ల ఈ రైలు ఎటువంటి హానికరమైన ఉద్గారాలను విడుదల చేయదు. డీజిల్ లేదా ఇతర శిలాజ ఇంధనాలతో నడిచే రైళ్లతో పోలిస్తే.. పర్యావరణానికి ఇది మేలు చేకూరుస్తోంది. రైలు ముందు భాగంలో సుమారు 27 హైడ్రోజన్ సిలిండర్లను, వెనుక భాగంలో మరో 27 సిలిండర్లను అమర్చారు. ప్రత్యేకంగా ఈ రైలు కోసమే జింద్లో పూర్తిగా స్వదేశీ హైడ్రోజన్ నిల్వ, ఇంధనం నింపే కేంద్రాన్ని నిర్మించారు.
భారత్లోనే తయారీ
తొలి హైడ్రోజన్ ట్రైన్ను పూర్తిగా భారత్లో అభివృద్ది చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద స్వదేశంలోనే అభివృద్ధి చేశారు. లక్నోలోని రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ దీని రూపకల్పనను చేపట్టగా.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారీ బాధ్యతను చేపట్టింది.
