7th pay commission: డీఏ అంటే ఏమిటి? దానికి జీతానికి సంబంధం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (డీఏ)కి సంబంధించి కేంద్రం శుభవార్త చెప్పింది. 4 శాతం డీఏను పెంచుతూ చేసిన తీర్మానాన్ని ఆమోదించింది. దీని వల్ల ఉద్యోగులకు ప్రయోజనం ఏమిటి? ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతాయి? పూర్తి వివరాలు తెలుసుకోండి.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏడో వేతన సంఘం సిఫార్సులను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (డీఏ)4 శాతం పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గం సమావేశం ఆమోదించింది. ఈ నేపథ్యంలో అసలు డీఏ అంటే ఏమిటి? అది ఉద్యోగి జీతం పై ఎంత మేర ప్రభావం చూపుతుంది. పెంచిన డీఏ తో ఉద్యోగి జీతం ఎంత పెరుగుతుంది? ఓ సారి చూద్దాం రండి.
డీఏ పెంపు అంటే ఏమిటి?
డీఏ పెంపు అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద బూస్ట్. భవిష్యత్తులో వారి జీతాల పెరుగుదలకు ఇది ఉపకరిస్తుంది. డీఏ పెంపు ప్రభుత్వ ఉద్యోగులకు ద్రవ్యోల్బణంతో పోరాడటానికి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉండటానికి సహాయపడుతుంది. డియర్నెస్ అలవెన్స్ అనేది ప్రజలపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వ ఉద్యోగి జీతంలో అందించే ఒక ప్రయోజనం. అంటే దేశంలోని ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ఉద్యోగి డీఏ పెరుగుతుంది. డీఏ పెంపును కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు సార్లు సవరించాల్సి ఉంటుంది. ఇక దీనిని ఏటా జనవరి, జులైల్లో చేపట్టాల్సి ఉండగా.. రెగ్యులర్గా మార్చి, సెప్టెంబర్లో నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. గతేడాది మార్చిలో 3 శాతం డీఏ పెంచగా 31 నుంచి 34 శాతానికి చేరింది. ఇక సెప్టెంబర్లో పెంపుతో 38 శాతానికి చేరింది. ఇప్పుడు మరో 4 శాతం పెంచగా అది 42 శాతానికి పెరిగింది.
మూడు నెలలది ఒకేసారి..
సవరించిన వేతనాలతోనే ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి వేతనాలు అందుతాయని కేంద్రం తెలిపింది. అంటే వచ్చే నెలలోనే వీరి జీతం పెరగనుంది. అయితే జనవరిలో పెంపు ఉండగా ఆలస్యం అయినందున వారికి జనవరి, ఫిబ్రవరికి సంబంధించి అరియర్స్ (బకాయిలు) కూడా అందనున్నాయి. మొత్తం మూడు నెలలకు సంబంధించి డీఏ ఒకేసారి చెల్లిస్తారన్నమాట.
జీతం ఎంత పెరుగుతుంది..
ప్రతి సారి డీఏ పెరిగినప్పుడు వారి ఉద్యోగి నెలవారీ జీతం కూడా పెరుగుతుంది. పెరిగిన మొత్తం బేసిక్ శాలరీకి యాడ్ అవుతుంది. డీఏ పెంపును అనురించి జీతం ఎంత పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం.. ఒక ఉద్యోగి జీతం రూ. 60,000 అనుకుంటే అతనికి డీఏ నాలుగు శాతం పెరిగితే అప్పుడు అతని జీతం రూ. 2,400 పెరుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..