Gold vs Silver: బంగారం వర్సెస్ వెండి.. దీనిపై పెట్టుబడి పెడితే భవిష్యత్తులో భారీ రాబడి పొందొచ్చు?
బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. సామాన్యులు ఆందోళన చెందుతుంటే, పెట్టుబడిదారులు లాభాల కోసం చూస్తున్నారు. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం, భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, బంగారం కంటే వెండి అధిక లాభాలను అందిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ మధ్యకాలంలో కాస్త అప్అండ్డౌన్స్ చూస్తున్నా.. కొన్ని నెలలుగా చూసుకుంటే మాత్రం బంగారం, వెండి రికార్డు స్థాయి ధరలకు చేరుకున్నాయి. ఈ ధరలు చూసి వీటిని కొనాలని అనుకుంటున్న సామాన్యులు భయపడుతుంటే.. వీటిపై పెట్టుబడి పెట్టాలని చూస్తున్నవారు మాత్రం కాస్త సంతోషిస్తున్నారు. పైగా తాజా రిపోర్ట్స్ ప్రకారం భవిష్యత్తులో గోల్డ్, సిల్వర్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ అంచనాల నడుమ, భవిష్యత్తులో భారీ రాబడి పొందాలంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడి పెడితే మంచిదా? లేక వెండిపై పెట్టుబడి మంచిదా? ఆలోచన చాలా మంది పెట్టుబడిదారుల్లో ఉంది. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా ఈ విషయం అర్థం కావడం లేదు. అయితే మరి దేనిపై పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం పొందవచ్చు అనే అంశంపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..
ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,30,000 ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,95,000 వద్ద ఉంది. వీటికి కాస్త అటూ ఇటూగా ధర మారుతూ వస్తూ ఉంది. అయితే ఇప్పుడు వీటిపై పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి లాభం ఉంటుందని చాలా మంది ఆర్థిక నిపుణులు చెబుతున్నా.. ఎక్కువ లాభం రావాలంటే మాత్రం వెండి వైపే మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు ధర కంటే ఏడాది కాలంలో బంగారం ధర 30 శాతం పెరిగితే, వెండి ధర దాదాపు 50 నుంచి 60 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




