భారత్పై గ్లోబల్ దిగ్గజాల స్పెషల్ ఫోకస్.. ప్రపంచ సంక్షోభాల వేళ ఇండియాలో పెట్టుబడుల వర్షం..
అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి ఉన్నప్పటికీ, భారతదేశంపై విదేశీ ఇన్వెస్టర్ల నమ్మకం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక రంగాన్ని నడిపించే ఏకైక 'గ్రోత్ ఇంజన్' భారత్ మాత్రమేనని నమ్ముతూ.. అమెజాన్, గూగుల్, ఎయిర్ట్రంక్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు లక్షల కోట్ల రూపాయల చెక్కులతో క్యూ కడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మరోవైపు అంతర్జాతీయ వాణిజ్య సంక్షోభాలు చుట్టుముడుతున్నా.. గ్లోబల్ సీఈవోల చూపు మాత్రం భారతదేశం వైపే ఉంది. భారత్ను ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న గ్రోత్ ఇంజన్గా అంతర్జాతీయ సంస్థల సీఈవోలు గుర్తిస్తున్నారు. కేవలం మాటలతో కాకుండా భారత్పై నమ్మకంతో ఏకంగా లక్షల కోట్ల రూపాయల చెక్కులు రాయడానికి అంతర్జాతీయ దిగ్గజాలు క్యూ కడుతున్నారు. ఇటీవలి కాలంలో గ్లోబల్ సీఈవోలు, మల్టీనేషనల్ కంపెనీలు భారతదేశంలో ప్రకటించిన కొన్ని అతిపెద్ద, సంచలన పెట్టుబడులే దీనికి నిదర్శనం.
అమెజాన్
అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయి పెట్టుబడులపై చర్చించారు. 2030 నాటికి భారత్లో అమెజాన్ మొత్తం పెట్టుబడులను 48 బిలియన్ డాలర్లకు పెంచనున్నట్లు వెల్లడించారు. ఇందులో 21 బిలియన్ డాలర్లను కేవలం ఏఐ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే కేటాయించారు. దీని ద్వారా 2030 నాటికి 3.8 మిలియన్ల ఉద్యోగాల కల్పన, 15 మిలియన్ల చిన్న వ్యాపారాల డిజిటైజేషన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎయిర్ట్రంక్ – రూ.2.5 లక్షల కోట్లు
ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ డేటా సెంటర్ దిగ్గజం ఎయిర్ట్రంక్ భారత్లో భారీ విస్తరణకు సిద్ధమైంది. 2030 నాటికి దేశంలో 5 గిగావాట్ల సామర్థ్యంతో భారీ డేటా సెంటర్లను నిర్మించేందుకు ఏకంగా 30 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. భారత్లో పెరుగుతున్న డిజిటల్ డేటా డిమాండ్కు ఇది అద్దం పడుతోంది.
గూగుల్ – రూ.1.25 లక్షల కోట్లు
టెక్ దిగ్గజం గూగుల్ సైతం భారత్లో ఏఐ సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ఐదేళ్ల కాలపరిమితితో 15 బిలియన్ డాలర్ల భారీ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ను ప్రకటించింది. ఇందులో సబ్సీ కనెక్టివిటీ, అత్యాధునిక డేటా సెంటర్లు, క్లౌడ్ కెపాసిటీ పెంపుతో పాటు భారతీయులకు ఏఐ స్కిల్లింగ్ అందించడం వంటి కీలక అంశాలు ఉన్నాయి.
సెయింట్ గోబైన్ – రూ.9,000 కోట్లకు పైగా
ఫ్రాన్స్కు చెందిన గ్లాస్ అండ్ మెటీరియల్స్ దిగ్గజం సెయింట్ – గోబైన్.. భారత్ను తమ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా అభివర్ణించింది. రాబోయే ఐదేళ్లలో దేశంలో తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు మరో 1 బిలియన్ యూరోల అదనపు పెట్టుబడిని ప్రకటించింది.
సీపీపీ ఇన్వెస్ట్మెంట్స్ – రూ.7,000 కోట్లు
కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్.. భారత్కు చెందిన CtrlS డేటాసెంటర్స్ భాగస్వామ్యంతో దేశంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, హైపర్స్కేల్ డేటా సెంటర్లను భారీగా విస్తరించేందుకు రూ.7,000 కోట్ల నిధులను కేటాయించింది.
ఏబీబీ – రూ.620 కోట్లకు పైగా
స్విస్ స్వీడిష్ గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం ABB.. భారతదేశంలోని కీలక పారిశ్రామిక రంగాలలో తయారీ సామర్థ్యాన్ని, ఆర్అండ్డీ రీసెర్చ్ విభాగాలను బలోపేతం చేయడానికి 75 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది.
గ్లోబల్ బాస్లు భారత్నే ఎందుకు ఎంచుకుంటున్నారు?
గూగుల్, అమెజాన్, ఎయిర్ట్రంక్ వంటి సంస్థలు పెడుతున్న పెట్టుబడులలో సింహభాగం ఏఐ, క్లౌడ్, డేటా సెంటర్లకే వెళ్తున్నాయి. భారత్లో పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం, డిజిటల్ ఎకానమీ దీనికి ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, స్టార్టప్లకు ఇస్తున్న ప్రోత్సాహం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో బలమైన నమ్మకాన్ని కలిగించాయి.ఈ మెగా ఇన్వెస్ట్మెంట్ల వల్ల రాబోయే ఐదేళ్లలో దేశంలో ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్, డేటా మేనేజ్మెంట్ రంగాలలో లక్షలాది హై-పెయింగ్ ఉద్యోగాలు లభించనున్నాయి.
ప్రపంచ దేశాలు ఆర్థిక మందగమనంతో సతమతమవుతుంటే.. భారత్ మాత్రం రికార్డు స్థాయి విదేశీ పెట్టుబడులతో దూసుకుపోతోంది. గ్లోబల్ సీఈఓల మెగా ఇన్వెస్ట్మెంట్ల సందేశం చాలా స్పష్టంగా ఉంది.. అదేంటంటే.. భారత్ తదుపరి ప్రపంచ ఆర్థిక శక్తి.. ఈ ఎదుగుదలలో భాగస్వాములు కావడానికి ఇదే సరైన సమయం.
