IND vs SL: లంకతో ప్రాక్టీస్ మ్యాచ్.. పిచ్ చూస్తే పిచ్చెక్కిందిగా.. భారత్ కోసం ఏం స్కెచ్ వేశార్రా సామీ..
India vs Sri Lanka Eleven Practice Match Pitch Controversy: శ్రీలంక బోర్డు వ్యూహాత్మకంగా గడ్డి పిచ్ను సిద్ధం చేసినప్పటికీ టీమిండియా ఈ సవాలును స్వీకరించడానికి సిద్ధమైంది. ఈ మూడు రోజుల మ్యాచ్ ద్వారా భారత యంగ్స్టర్స్ ఏ మేరకు లంక పరిస్థితులకు అలవాటుపడతారో వేచి చూడాలి.

India vs Sri Lanka Eleven Practice Match Pitch Controversy: శ్రీలంక పర్యటనలో ఉన్న శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు తొలి రోజే ఊహించని షాక్ తగిలింది. శ్రీలంక ఎలెవెన్తో జరగనున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కోసం సిద్ధం చేసిన వికెట్పై భారీగా పచ్చిక ఉంచడం పట్ల టీమిండియా యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ నెల 15 నుంచి ఆతిథ్య శ్రీలంకతో టీమిండియా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. అక్కడ ఉండే పిచ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత జట్టు కొలంబోలోని నాన్డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ మైదానంలో శ్రీలంక ఎలెవెన్తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడటానికి సిద్ధమైంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే పిచ్ రూపురేఖలను చూసి భారత యాజమాన్యం ఆశ్చర్యానికి గురైంది. సాధారణంగా శ్రీలంక వికెట్లు స్పిన్నర్లకు ఎక్కువగా సహకరిస్తాయి. దాంతో స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
పిచ్పై భారత్ అసంతృప్తి..
మ్యాచ్ కోసమని మైదానంలోకి అడుగుపెట్టిన గిల్ సేనకు పిచ్పై అధికంగా గడ్డి కనిపించింది. దీనిపై టీమిండియా టీమ్ మేనేజ్మెంట్ నిర్వాహకులకు తమ నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. శ్రీలంకలో స్పిన్ పిచ్లపై శిక్షణ పొందాలని భావిస్తే, పచ్చిక ఉంచడం ఏంటని ప్రశ్నించింది. దీనిపై నాన్డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ అధికారి స్పందిస్తూ.. మూడు రోజుల మ్యాచ్ల కోసం సాధారణంగానే గడ్డి ఉంచుతామని, పూర్తిగా పచ్చిక లేని పిచ్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. శ్రీలంక క్రికెట్ బోర్డు సూచనల మేరకే పిచ్ను ఈ విధంగా సిద్ధం చేశామని ఆయన వెల్లడించారు.
తొలి రోజు పేసర్లకు.. ఆపై స్పిన్నర్లకు అనుకూలం..
క్యూరేటర్లు తెలిపిన వివరాల ప్రకారం ఈ వికెట్ మ్యాచ్ సాగే కొద్దీ మారుతుంది. మొదటి రోజు పిచ్పై ఉన్న గడ్డి కారణంగా పేస్ బౌలర్లకు మంచి స్వింగ్ దక్కే అవకాశం ఉంది. రెండు లేదా మూడో రోజు నుంచి వికెట్ పొడిగా మారి స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మైదానంలో టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం శుభ పరిణామమని వారు సూచిస్తున్నారు. ఏదేమైనా పిచ్ నాణ్యత విషయంలో రాజీ పడలేదని లంక బోర్డు క్లారిటీ ఇచ్చింది.
ఒకటో రెండో కాదు.. ఏకంగా 97 నదులు పారే ఏకైక జిల్లా.. ఎక్కడో కాదు మనదేశంలోనే..?
పరిస్థితులకు అలవాటు పడటమే భారత్ లక్ష్యం..
ఆతిథ్య జట్టు మైండ్ గేమ్ ఆడుతున్నప్పటికీ భారత జట్టు దీన్ని ఒక మంచి అవకాశంగా భావిస్తోంది. ఇది కేవలం ప్రాక్టీస్ మ్యాచ్ కాబట్టి పిచ్ ఎలాంటిదైనా తమ లోపాలను సరిదిద్దుకోవడంపైనే గిల్ సేన దృష్టి పెట్టింది. టెస్ట్ సిరీస్ ప్రారంభమయ్యే లోపు ఇక్కడి వాతావరణం, పిచ్ ప్రవర్తనను ఆకలింపు చేసుకుంటే ప్రధాన మ్యాచ్లలో మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంటుంది. కొలంబో వేదికగా ఉదయం 10 గంటలకు ఈ ప్రాక్టీస్ సమరం ప్రారంభం కానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




