BCCI: రోహిత్ ఒక్కడే కాదా.. అగార్కర్ గుడ్బై చెప్పడానికి అసలు కారణం అతనేనా..?
Ajit Agarkar: భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) తన పదవీకాలం ముగియకముందే వైదొలగడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రోహిత్ శర్మ (Rohit Sharma) కెరీర్ ముగింపుపై తలెత్తిన వివాదాలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (Centre of Excellence) అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) తో విభేదాలే ఈ పరిణామానికి ప్రధాన కారణమయ్యాయి.

Ajit Agarkar: 2027 వన్డే ప్రపంచకప్ (ODI World Cup) సమీపిస్తున్న తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికి వీడ్కోలు పలికాడు. ఆయన హయాంలో జట్టు నాలుగు ఐసీసీ టోర్నమెంట్లలో ఫైనల్స్కు చేరుకుని రెండు టీ20 ప్రపంచకప్లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయినప్పటికీ రోహిత్ శర్మ కెరీర్ ముగింపుపై బోర్డు పెద్దలతో వచ్చిన భేదాభిప్రాయాలు ఆయన నిష్క్రమణకు దారితీశాయి. ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తరువాత జరిగిన అత్యున్నత సమీక్షా సమావేశానికి అగార్కర్ హాజరుకాకపోవడం బోర్డు వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఇంగ్లండ్ టూర్ ప్రారంభానికి ముందే లార్డ్స్ వన్డే తరువాత రోహిత్ శర్మ కెరీర్కు ముగింపు పలకాలని అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ప్రజ్ఞాన్ ఓజా (Pragyan Ojha) ద్వారా రోహిత్కు చేరవేశారు. అయితే వచ్చే మెగా టోర్నీలో ఆడాలని భావిస్తున్న సీనియర్ ఓపెనర్ ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాడు. నేరుగా ఒక పవర్ ఫుల్ అధికారితో మాట్లాడి తన ఆవేదనను వెళ్లగక్కగా, బోర్డు వెంటనే స్పందించి రోహిత్కు మద్దతు తెలుపుతూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనివల్ల పెద్ద ఆటగాళ్ల భవిష్యత్తును నిర్ణయించే పూర్తి అధికారాలు సెలెక్టర్లకు లేకుండా పోయాయని అగార్కర్ తీవ్రంగా భావించాడు. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) వంటి యువ ఆటగాడికి భవిష్యత్తు కోసం తగినన్ని వన్డే అవకాశాలు కల్పించాలని ఆయన కోరగా, రోహిత్ సాధిస్తున్న పరుగులు ఆయన స్థానానికి రక్షణగా నిలిచాయి.
మరోవైపు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్తో కూడా అగార్కర్కు విధానపరమైన తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఆసియా క్రీడలు వంటి పోటీలకు ప్రధాన ఆటగాళ్లను కేటాయించడంపై అగార్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఏ టోర్నమెంట్లోనైనా అత్యుత్తమ బలగంతో బరిలోకి దిగాలనే పట్టుదలతో లక్ష్మణ్ ఉండటం ఇరువర్గాల మధ్య అంతరాన్ని పెంచింది. అలాగే ఇండియా-ఏ మ్యాచ్ల షెడ్యూల్, ఇరానీ కప్ తేదీలు ఒకే సమయంలో క్లాష్ కావడం, గాయపడిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల పునరాగమన తేదీలపై ఎలాంటి స్పష్టత లేకపోవడం లాంటి పరిణామాలు సమస్యలను జటిలం చేశాయి. ఆటను నిబద్ధతతో నడిపించాలనే ఆలోచన చేసిన అగార్కర్, సెలెక్షన్ కమిటీ స్వయంప్రతిపత్తి ప్రశ్నార్థకం కావడం అలాగే బోర్డు పెద్దలతో పొసగని వాతావరణం కారణంగా తన పదవిని వీడేందుకు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
