Ford India shut down: కార్ల తయారీ సంస్థ ఫోర్ట్‌ మోటార్‌ సంచలన నిర్ణయం.. భారత్‌లో ప్లాంట్ల మూసివేత

Ford India shut down: అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్‌ మోటార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఫోర్డ్‌ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు..

Ford India shut down: కార్ల తయారీ సంస్థ ఫోర్ట్‌ మోటార్‌ సంచలన నిర్ణయం.. భారత్‌లో ప్లాంట్ల మూసివేత
Follow us

|

Updated on: Sep 10, 2021 | 5:54 AM

Ford India shut down: అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్‌ మోటార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఫోర్డ్‌ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో భారత్‌లో ఫోర్డ్‌ కంపెనీ కార్ల ఉత్పత్తి నిలిచిపోనుంది. సనంద్‌, చెన్నై నగరాల్లోని ప్లాంట్లను ఫోర్డ్‌ మూసివేయనుంది. కంపెనీకి భారీ నష్టాలు, బహిరంగ మార్కెట్‌లో వృద్ధి లేకపోవడంతో ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

లాభాలకంటే నష్టాలే ఎక్కువ..!

కాగా, 2021 నాలుగో త్రైమాసికం నాటికి గుజరాత్‌లోని సనంద్‌లో వాహనాల తయారీని, 2022 రెండవ త్రైమాసికానికి చెన్నైలో వాహన ఇంజిన్ తయారీని ఫోర్డ్ నిలిపివేస్తుందని ఫోర్డ్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. జీఎమ్‌ మోటార్స్‌ తరువాత భారత్‌ నుంచి వైదొలుగుతున్న రెండో కంపెనీగా ఫోర్డ్‌ నిలిచింది. 2017లో జనరల్‌ మోటార్స్‌ భారత్‌లో కార్ల అమ్మకాలను నిలిపివేసింది. గత పదేళ్లలో 2 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువగా నిర్వహణ నష్టాలను చవి చూసిన ఫోర్డ్‌.. ఇండియాలో స్థిరమైన లాభదాయకమైన వ్యాపారాన్ని సృష్టించడానికి పునర్నిర్మాణ చర్యలు తీసుకున్నా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ప్లాంట్‌లను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది.

కంపెనీలో 4 వేల మంది ఉద్యోగులు..

తాజాగా ఫోర్డ్‌ తీసుకున్న నిర్ణయంతో కంపెనీలో పనిచేసే 4 వేల మంది ఉద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనుంది. కరోనా, లాక్‌డౌన్‌, డేటెడ్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోతో ఫోర్డ్ మరింత నష్టపోతున్న స్థానిక సంస్థగా తయారైంది. జూలై నాటికి, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) షేర్ చేసిన డేటా ప్రకారం ఫోర్డ్ రెండు ప్లాంట్లలో ఉన్న 450,000 యూనిట్ల ఇన్‌స్టాల్ చేయబడిన సామర్థ్యంలో కేవలం 20 శాతం యూనిట్లను మాత్రమే ఆపరేట్‌ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

భారత్‌తో రెండు బిలియన్‌ డాలర్లకుపైగా పెట్టుబడి..

కాగా, ఫోర్డ్‌ ఇప్పటివరకు భారత్‌లో సుమారు రెండు బిలియన్‌ డాలర్లపైగా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. 350 ఎకరాలలో ఉన్న చెన్నై ప్లాంట్ ఏడాదికి 200,000 యూనిట్లు, 340,000 ఇంజిన్ల వాహన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సనంద్ ప్లాంట్ 460 ఎకరాలలో విస్తరించి ఉండగా, ఏడాదికి 240,000 యూనిట్లు, 270,000 ఇంజిన్‌ల వాహన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ 1.57 శాతం మార్కెట్ వాటాతో, భారత అతిపెద్ద కార్ల తయారీదారుల జాబితాలో ఫోర్డ్ 9వ స్థానంలో నిలిచింది.

ఇవీ కూడా చదవండి:

Amazon FD: అమెజాన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి రానున్న కొత్త సేవలు..!

Mobile Apps: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి రికార్డు సృష్టించిన భారత్‌.. గంటలపాటు యాప్స్‌లోనే..