Investments: కొత్త వడ్డీ రేట్లను ఖరారు చేసిన కేంద్రం.. ఈ సారి కూడా..
కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు పథకాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లాంటి అనేక పథకాలను నడుపుతోంది. వీటిల్లో లక్షలాది మంది పెట్టుబడులు పెడుతున్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి తాజాగా వడ్డీ రేట్లను ఖరారు చేసింది.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక పొదుపు పథకాలు నడుస్తున్న విషయం తెలిసిందే. వీటికి ప్రతీ త్రైమాసికానికి వడ్డీ రేట్లను ప్రకటిస్తూ ఉంటుంది. 2027 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తాజాగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం యథాతథంగా ఉంచింది. ఎలాంటి మార్పులు చేయకుండా ఉండటం ఇది వరుసగా తొమ్మిదోసారి. 2026 జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఈ రేట్లు వర్తిస్తాయి. 2027 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి నోటిఫై చేసిన రేట్ల మాదిరిగానే ఈ త్రైమాసికానికి కూడా ఉండనున్నాయి.
మూడు నెలల పాటు అమల్లో..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వంటి పొదుపు పథకాలకు మరో మూడు నెలల పాటు వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయి. సుకన్య సమృద్ధి యోజన పథకానికి 8.2 శాతంగా ఉండగా.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 7.1 శాతం అందిస్తుంది. ఇక నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకానికి వడ్డీ రేటు 7.7 శాతం వద్ద యథాతథంగా ఉండగా.. 115 నెలల మెచ్యూరిటీ కాలంతో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ కు 7.5 శాతం వద్ద ఉంది. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ 7.4 శాతంగా ఉంది. ఇక మూడేళ్ల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకానికి 7.1 శాతం వద్ద యథాతథంగా ఉంది. ఇక పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ 4 శాతంగా ఉండనుంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి ఒక సంవత్సరం డిపాజిట్లపై 6.9 శాతం, రెండేళ్ల డిపాజిట్లపై 7 శాతం, మూడేళ్ల డిపాజిట్లపై 7.1 శాతంగా ఉంది.
మార్కెట్ పరిస్థితుల ఆధారంగా..
ఐదేళ్ల డిపాజిట్లపై 7.5 శాతం అందిస్తాయి. ఇక ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై 6.7 శాతం వడ్డీని అందిస్తున్నారు. 2024 జనవరి-మార్చి త్రైమాసికం నుండి చాలా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లల్లో ఎలాంటి మార్పులు లేవు. చివరిగా ఏప్రిల్ 2024లో మార్పులు జరిగాయి. అప్పుడు మూడేళ్ల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్పై వడ్డీ రేటును 7 శాతం నుండి 7.1 శాతానికి, సుకన్య సమృద్ధి యోజన రేటును 8 శాతం నుండి 8.2 శాతానికి పెంచారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. ఈ రేట్లు ప్రామాణిక రాబడులపై నిర్దేశిత స్ప్రెడ్తో సంబంధిత మెచ్యూరిటీల ప్రభుత్వ సెక్యూరిటీల రాబడులకు అనుసంధానించబడి ఉంటాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, విస్తృత ఆర్థిక పరిగణనలను బట్టి ప్రభుత్వం ప్రస్తుత రేట్లను కొనసాగించవచ్చు.
