Breaking తబ్లిఘీ చీఫ్ కోసం వేట ముమ్మరం
నిబంధనలను ఉల్లంఘించి, ఆదేశాలను బేఖాతరు చేసి మరీ సదస్సు నిర్వహించి దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కారకుడైన తబ్లిఘీ జమాత్ అధినేత మౌలానా సాద్ కోసం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వేట ముమ్మరం చేశారు.
తబ్లిఘీ జమాత్ చీఫ్ కోసం వేట ముమ్మరమైంది. నిబంధనలను ఉల్లంఘించి, ఆదేశాలను బేఖాతరు చేసి మరీ సదస్సు నిర్వహించి దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కారకుడైన తబ్లిఘీ జమాత్ అధినేత మౌలానా సాద్ కోసం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గాలింపు వేగవంతం చేశారు. దర్యాప్తుకు సహకరిస్తానంటూ బీరాలు పలికి ఆ తర్వాత మాయమైన మౌలానా సాద్ కోసం గురువారం ఉత్తర్ ప్రదేశ్లో భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించారు.
మౌలానా సాద్ ప్రవర్తనలో ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదాలు ఆయన కరోనా వ్యాప్తికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం చేసినట్లు తేలుస్తున్నాయని క్రైమ్ బ్రాంచ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి.
ఉత్తర ప్రదేశ్లోని షామ్లీ జిల్ కాందల్వి ఫామ్ హౌస్లో గురువారం పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు పోలీసులు. కరోనా వైరస్ను ప్రబలింప చేసినట్టు మౌలానా సాద్పై అభియోగాలు నమోదయ్యాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో అనుమతి లేకుండా పెద్ద ఎత్తున మర్కజ్ ప్రార్థనలు, సదస్సు నిర్వహించినట్టు ఆయనపై కేసు నమోదయ్యింది.
దేశంలో నలుమూలాల కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి నిజాముద్దీన్ కార్యకర్తలే కారణమని ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ ప్రార్థనల్లో పాల్గొన్నవారు దేశం నలుమూలలకు వెళ్లారు. వారిలో కరోనా వ్యాపించడంతో ఇతరులకు కూడా ఆ వైరస్ సోకినట్టు నివేదికలు చెబుతున్నాయి.
ఢిల్లీలోని మౌలానా సాద్ నివాసంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే రంజాన్ ప్రార్థనలు ఇళ్లల్లోనే జరుపుకోవాలంటూ ముస్లింలకు ఇప్పటకే పిలుపునిచ్చారు మౌలానా సాద్. కరోనాను అరికట్టడానికి ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. మౌలానాపై మార్చి 31న కేసు నమోదయ్యింది. ప్రస్తుతం గాలింపు ముమ్మరమైంది.