సూర్య గ్రహణ ప్రభావం ఈ రాశులపైనే.. దోషం తొలగిపోవాలంటే ఇలా చేయండి
ఈ ఏడాది ఫిబ్రవరి 17న అమావాస్య నాడు సంభవించే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించనప్పటికీ.. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. ఈ గ్రహణం కుంభరాశిలో ధనిష్ట నక్షత్రంలో ఏర్పడుతుంది. ప్రభావిత రాశుల వారు దేవతా ఆరాధన, ఇష్టదేవతా పూజ వంటి పరిహారాలు పాటించడం శుభదాయకం. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, తీవ్రవాద చర్యలు, సామూహిక జనమరణాలు సంభవించే అవకాశం ఉంది.

హిందూ మతంలో ప్రతి పౌర్ణమి, అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది 17న మాఘ అమావాస్యతో కూడిన అంగారకవారం రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం ధనిష్ట నక్షత్రంలో ఏర్పడటం, కుజుడు 12వ ఇంట్లో ఉండటం దోషకరంగా పరిగణించబడుతుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి, పట్టు విడుపు స్నానాలు, నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. గర్భిణులు కూడా ప్రత్యేక నియమాలను పాటించనవసరం లేదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నందిభట్ల శ్రీహరి శర్మ వివరించారు. అయితే, గ్రహణం కనిపించకపోయినా, దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది.
విపరీత పరిణామాలు
దీనికి ఉదాహరణగా 2005 ఏప్రిల్లో భారతదేశంలో కనిపించని సూర్యగ్రహణం సమయంలో పెహల్గాంలో జరిగిన దాడిని, 26 మంది అమాయకుల మరణాన్ని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ గ్రహణం సౌత్ అమెరికా దేశాలైన వెనిజులా వంటి ప్రాంతాలలో కనిపిస్తుందని, గతంలో వెనిజులా అమెరికా అధీనంలోకి వెళ్ళడానికి గ్రహణ ప్రభావం ఒక కారణమని ఆయన వివరించారు. గ్రహణం ఏర్పడిన ఒకటిన్నర నెల ముందు లేదా మూడు నెలల తర్వాత విపరీత పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
వీరిపైనే ప్రభావం
ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతున్నందున, మేషరాశి, కన్యారాశి, ధనుస్సురాశి వారికి మేలు జరుగుతుంది. అయితే వృషభ, మిథున, కర్కాటక, సింహ, తులా, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశులలో జన్మించిన వారికి మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకావచ్చు. ఈ తొమ్మిది రాశుల వారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా గ్రహణ ప్రభావానికి లోనవుతారు. ఆర్థిక నష్టాలు, ఉద్యోగ సమస్యలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, దాంపత్య సంబంధాలలో విభేదాలు వంటివి ఈ సమయంలో తీవ్రతరం కావచ్చని ఆయన తెలిపారు. సాధారణ సమస్యలు కూడా పెద్దవిగా మారే అవకాశం ఉందని వివరించారు.
గ్రహణ దోషం పోవాలంటే..
ప్రభావిత రాశుల వారు పరిహారాలు పాటించడం తప్పనిసరి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3:24 నుండి 7:45 నిమిషాల వరకు గ్రహణ ప్రభావ సమయం ఉంటుంది. ఈ సమయంలో దేవతా ఆరాధన లేదా ఇష్టదేవతా ఆరాధన చేయడం ద్వారా గ్రహణ దోష ప్రభావాలను తొలగించుకోవచ్చు.
శుక్రుడు, బుధుడు, రాహువు, సూర్యుడు, చంద్రుడు ధనిష్ట నక్షత్రంలో స్థితి పొంది ఉండటం, ధనిష్ట నక్షత్రాధిపతి అయిన కుజుడు మకరరాశిలో ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, పరస్పర దాడులు, బాంబు విస్ఫోటనాలు, తీవ్రవాద చర్యలు, సామూహిక జన మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్, ఇరాన్-అమెరికా, ఇండో-పాకిస్తాన్, చైనా-తైవాన్, ఇజ్రాయిల్-హమాస్ వంటి దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన సమస్యలు పెరిగి, అశుభాలు జరిగే అవకాశం కూడా ఉందని గురువు నందిభట్ల శ్రీహరి శర్మ పేర్కొన్నారు.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని సంస్థ ధృవీకరించదు.)
