AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో పొలిటికల్ హీట్.. రెబల్ ఎమ్మెల్యేలు హాజరయ్యేనా..? స్పీకర్ నిర్ణయం ఎలా ఉండనుంది..

ఆంధ్రప్రదేశ్ లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం రాజకీయాల్లో హీటెక్కిస్తోంది. రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? ఇవాళ స్పీకర్ ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.. ఇప్పుడిదే ఉత్కంఠగా మారింది. 8 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదనే చర్చ జోరుగా సాగుతోంది.

Andhra Pradesh: ఏపీలో పొలిటికల్ హీట్.. రెబల్ ఎమ్మెల్యేలు హాజరయ్యేనా..? స్పీకర్ నిర్ణయం ఎలా ఉండనుంది..
Tdp Ysrcp
pullarao.mandapaka
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jan 29, 2024 | 8:23 AM

Share

ఆంధ్రప్రదేశ్ లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం రాజకీయాల్లో హీటెక్కిస్తోంది. రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? ఇవాళ స్పీకర్ ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.. ఇప్పుడిదే ఉత్కంఠగా మారింది. 8 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలు ఈరోజు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి న‌లుగురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు.. గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ, చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాల గిరిధ‌ర్, విశాఖ‌ప‌ట్నం ద‌క్షిణ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ టీడీపీ నుంచి వైసీపీలోకి మారారు.. ఇక నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి, వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, ఉద‌య‌గిరి ఎమ్మెల్యే మేక‌పాటి చంద్రశేఖ‌ర్ రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. రెండు పార్టీలు కూడా ఆయా ఎమ్మెల్యేల‌పై అన‌ర్హత వేటు వేయాల‌ని స్పీక‌ర్ ను కోరాయి. దీంతో ఈనెల 19న మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేల‌కు స్పీక‌ర్ నోటీసులు పంపించారు. స్పీక‌ర్ నోటీసుల‌పై టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి స్పంద‌న లేదు.. కానీ వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యేలు మాత్రం నాలుగు వారాలు గ‌డువు కోరుతూ లేఖ‌లు పంపారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం 60 రోజులు గడువు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. మరోవైపు తనకు ఆరోగ్యం బాగోలేనందున నాలుగు వారాలు గడువు ఇవ్వాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. అయితే ఈ లేఖలపై స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 29 న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని మరోసారి నోటీసులు పంపారు.. దీంతో ఈరోజు ఎమ్మెల్యేలు హాజరుపై చర్చ మొదలైంది.

అనర్హతపై వివరణ ఇవ్వనున్న ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు

స్పీకర్ ఇచ్చిన నోటీసులపై గడువు కోరారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. టీడీపీ రెబల్స్ మాత్రం స్పందించలేదు. అయితే ఈనెల 25న మ‌రోసారి ఎమ్మెల్యేల‌కు నోటీసులు పంపారు స్పీకర్. ఈనెల 29న సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యేల‌ను మ‌ధ్యాహ్నం 2.45 కు టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యేలు వ్యక్తిగ‌తంగా హాజ‌రై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం నోటీసులు పంపించారు.. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యేల హాజ‌రు ఉత్కంఠ‌గా మారింది. అయితే టీడీపీ నలుగురు రెబల్ ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం స్పీకర్ ఎదుట హాజరవుతారని తెలిసింది. వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ లు స్పీకర్ ఎదుట హాజరుకానున్నారు. మరో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మాత్రం వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశీ పర్యటనలో ఉండటంతో ఫిబ్రవరి 2వ తేదీ వరకూ గడువు కావాలని కోరారు. ఇక వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజ‌ర‌వుతారా.. లేదా అనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇవాళ ఉదయం తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే లు వస్తారని సమాచారం. ఒక‌వేళ స్పీకర్ ఎదుట హాజరైతే ఏం స‌మాధానం చెబుతారు..? ఎమ్మెల్యేలు ఇచ్చే స‌మాధానానికి స్పీక‌ర్ సంతృప్తి వ్యక్తం చేస్తారా లేదా అన‌ర్హత వేటు వేస్తారా…? ఒక‌వేళ హాజ‌రుకాకుంటే స్పీక‌ర్ నిర్ణయం ఎలా ఉంటుంద‌నే దానిపై చ‌ర్చ జరుగుతోంది.

ఒక‌వేళ ఎమ్మెల్యేలు హాజ‌రుకాకుంటే అన‌ర్హత వేటుప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుగుదేశం పార్టీలో చ‌ర్చ జ‌రుగుతుంది. ఇదంతా రాజ్యస‌భ ఎన్నిక‌ల కోస‌మే అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేత‌లు.. త్వర‌లో రాజ్యసభ ఎన్నిక‌లు ఉండ‌టంతో తెలుగుదేశం పార్టీ బ‌లం త‌గ్గించ‌డం కోస‌మే స్పీక‌ర్ హ‌డావుడి నిర్ణయం అని ఆరోపిస్తున్నారు. మ‌రోవైపు వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల నాటికి ఈ విష‌యంలో ఏదొక నిర్ణయం తీసుకోవ‌ల‌సి ఉండ‌టంతోనే స్పీక‌ర్ నోటీసులు అనే వాద‌న కూడా వినిపిస్తుంది. మొత్తానికి సోమ‌వారం స్పీక‌ర్ నిర్ణయం ఎలా ఉంటుంద‌నేది మాత్రం ఆస‌క్తిగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..