AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రాయలసీమలో హై ఓల్టేజ్ పాలిటిక్స్.. ఎన్నికల కదనరంగంలోకి జగన్, చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే..

ఏపీలో ఇవాళ బిగ్‌ డే. ఇవాల్టి నుంచే పొలిటికల్ సమ్మర్‌ సీజన్‌ మొదలవుతోంది. సీఎం జగన్‌, విపక్ష నేత చంద్రబాబు..ఇద్దరూ కూడా ఇవాల్టి నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. అది కూడా సీమ నుంచే ప్రారంభం కానుంది. మేమంతా సిద్ధం పేరుతో జగన్‌ బస్సు యాత్రతో జనంలోకి దూసుకెళ్లనున్నారు. ఇక ప్రజా గళం పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు చంద్రబాబు.

Andhra Pradesh: రాయలసీమలో హై ఓల్టేజ్ పాలిటిక్స్.. ఎన్నికల కదనరంగంలోకి జగన్, చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Ys Jagan Chandrababu
Shaik Madar Saheb
|

Updated on: Mar 27, 2024 | 11:45 AM

Share

ఏపీలో ఎన్నికల వార్‌ షురూ అయింది. మేమంతా సిద్ధం పేరుతో ఏపీ సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర జరుగుతుంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు ఇడుపులపాయ చేరుకుంటారు జగన్‌. వైఎస్‌ సమాధి దగ్గర ప్రార్థన తర్వాత మధ్యాహ్నం 1:30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. ఇడుపులపాయ, వేంపల్లి , వీరపునాయనపల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటారు జగన్‌. ప్రొద్దుటూరులో సాయంత్రం నాలుగుగంటలకు మేమంతా సిద్దం మొదటి సభ జరగనుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్ధం సభల మాదిరిగానే ఈ సభలో కూడా ర్యాంప్‌ ఏర్పాటు చేశారు.

28న నంద్యాలలో.. 29న ఎమ్మిగనూరులో..

ప్రొద్దుటూరు సభకు లక్షా 50 వేలమంది వస్తారని అంచనా వేస్తున్నారు. కడప జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, నేతలు ఈ సభకు భారీగా తరలి రానున్నారు. సభలో సీఎంతో పాటు కడప జిల్లా వైసీపీ అభ్యర్థులు పాల్గొంటారు. సభ ముగిశాక సీంఎ జగన్‌….ప్రొద్దుటూరు నుంచి బయలుదేరి దువ్వూరు మీదుగా కర్నూలు జిల్లా లోని ఆళ్లగడ్డ చేరుకుంటారని రాత్రికి అక్కడే బస చేస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 28న నంద్యాలలో భారీ బహిరంగ సభలో జగన్‌ పాల్గొంటారు. 29న ఎమ్మిగనూరు సభలో పాల్గొంటారు.

ప్రజాగళం పేరుతో చంద్రబాబు రోడ్‌ షోలు, సభలు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఇవాల్టి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఈ నెల 31 వరకు ఆయన పర్యటనలు కొనసాగుతాయి. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. ఇవాళ పలమనేరు, పుత్తూరు, మదనపల్లె నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి సభల్లో పాల్గొటారు. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో చంద్రబాబు పర్యటన ఉంటుంది. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో పాల్గొంటారు. 31న కావలి, మార్కాపురం, రేపల్లె, బాపట్లలో పర్యటిస్తారు.

నువ్వా నేనా అంటున్న జగన్‌, చంద్రబాబు…ఇద్దరూ కూడా సీమ నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తుండడంతో ఏపీలో రాజకీయం వేడెక్కింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..