AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చల్ల చల్లని కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మండే ఎండాకాలంలో కురిసిన వానతో వెదర్‌ కూల్‌కూల్‌ అయిపోయింది. కానీ.. పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షం.. అన్నదాతలను ఆగమాగం చేసింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పింది.

చల్ల చల్లని కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Mar 22, 2025 | 7:04 AM

Share

వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మండే ఎండాకాలంలో కురిసిన వానతో వెదర్‌ కూల్‌కూల్‌ అయిపోయింది. కానీ.. పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షం.. అన్నదాతలను ఆగమాగం చేసింది. ఎండలు మండిపోతున్న వేళ శుక్రవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌లో పలుచోట్ల వర్షం కురవగా.. మరికొన్నిచోట్ల వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్ వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. పోచమ్మ బస్తీలో ఈదురుగాలులకు భారీ వృక్షం నేలకొరిగింది. దాంతో.. రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణా, ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో శనివారం, ఆదివారం తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది..

రాగల రెండు రోజులు తెలంగాణలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనావేసింది. ఆ తరువాత ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ రోజు గరిష్టంగా భద్రాచలం లో 38.5 కనిష్టంగా హనుమకొండ లో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.

ఇదిలాఉంటే.. నిన్న తెలంగాణ లోని మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, మహబూబ్ నగర్, ఖమ్మం లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.. మెదక్..39.6, ఆదిలాబాద్..39, నిజామాబాద్..38.6, భద్రాచలం..37.8, మహబూబ్ నగర్..37.6, ఖమ్మం..37.6, నల్లగొండ..37 హైదరాబాద్..36.5, రామగుండం..35.2, హనుమకొండ..34.5 డిగ్రీల పగలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..

ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్.. వచ్చే నాలుగు రోజులు వర్షాలు

ఏపీలోని 18 మండలాల్లో శనివారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా-6, విజయనగరం-7, పార్వతీపురం మన్యం-5 మండలాల్లో (మొత్తం 18 మండలాలు) వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు..

ఆదివారం మన్యం జిల్లా -4 అల్లూరి జిల్లా-2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమర్రి లో 40.9°C, కర్నూలు జిల్లా కోసిగిలో 40.6°C, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.2°C, వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట, అన్నమయ్య జిల్లా గాదెలలో 40.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 28 మండలాల్లో ఓ మోస్తరు వడగాల్పులు వీచాయి..

రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పిడుగులతోపాటు గంటకు 30 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని.. కొద్దిరో జులుగా వడగాలులు, తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభిస్తుందని పేర్కొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..