కరోనాతో రాజకీయాలు వద్దు..ప్రతిపక్షాలకు మంత్రి హితవు
ఓ వైపు దేశవ్యాప్తంగా కరోన కల్లోలం సృష్టిస్తుంటే..తెలంగాణలో విపక్షాలు మాత్రం అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ఐటీ పురపాలక మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కరోనా విషయంలో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
ఓ వైపు దేశవ్యాప్తంగా కరోన కల్లోలం సృష్టిస్తుంటే..తెలంగాణలో విపక్షాలు మాత్రం అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ఐటీ పురపాలక మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కరోనా విషయంలో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కరోనాను పూర్తిగా నివారించిన రాష్ట్రం ఏదో చెప్పాలని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. కరోనా కేసుల్లో భారత్ మూడో స్థానంలో ఉన్నదని, ఇది ప్రధాని మోదీ వైఫల్యంగా భావించాలా అని పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ..త్వరలోనే మెడికల్ కాలేజీలో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. వైద్యం, విద్య ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని అన్నారు. ప్రభుత్వ వైద్య రంగంపై మరింత నమ్మకం కలిగిస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా రోగులను తిరస్కరించినా, ప్రభుత్వ ఆసుపత్రులు అండగా నిలిచాయని తెలిపారు. కరోనా రోగులతో వేలివేసినట్టుగా వ్యవహరించరాదని అన్నారు. కరోనా వారు వీరు అనే తేడా లేకుండా ఎవరికైనా రావొచ్చని, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం చేయడం తగదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇది రాజకీయాలకు సమయం కాదని, కలిసికట్టుగా కరోనాపై పోరాటం చేయాల్సిన సమయం అన్నారు. రాజకీయంగా విమర్శలు చేయడం వలన వైద్య సిబ్బంది ఆత్మ స్థైర్యం దెబ్బతింటుందని అన్నారు. రెండు శాతం మరణాలను చూపించి, 98 శాతం రికవరీలను చిన్నదిగా చూపొద్దని కోరారు. అవసరమైతే కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య మరింత పెంచుతామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రాణాలకు ఎదురొడ్డి కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.