AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుమేధ మృతిపై అనుమానం: మేయర్ బొంతు రమ్మోహన్

హైదరాబాద్ కు చెందిన 11 ఏళ్ల చిన్నారి సుమేధ మృతిపై కొత్త వాదన తెరపైకి వచ్చింది. అసలు చిన్నారి మరణంపై తమకు అనుమానం ఉందని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అనడం చర్చకు దారితీసింది.

సుమేధ మృతిపై అనుమానం: మేయర్ బొంతు రమ్మోహన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 20, 2020 | 7:51 PM

Share

హైదరాబాద్ కు చెందిన 11 ఏళ్ల చిన్నారి సుమేధ మృతిపై కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఇప్పటికే సుమేధ మృతిపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేయగా, అసలు చిన్నారి మరణంపై తమకు అనుమానం ఉందని మేయర్ బొంతు రామ్మోహన్ అనడం చర్చనీయాంశంగా మారింది.

కన్నబిడ్డను కోల్పోయిన వారి కడుపుకోత ఓవైపు, ఆ చిన్నారి మరణంపై వినిపిస్తున్న భిన్న వాదనలు మరోవైపు. ఇంతకు చిన్నారి సుమేధ ఎలా చనిపోయింది..? నిజంగా నాలాలో పడి చనిపోలేదా? మరి పోలీసులు, మేయర్‌ చెబుతున్న మాటల్లో తేడాలెందుకున్నాయి. సుమేధ మృతిపై కొత్తగా ట్రయాంగిల్‌ తెరపైకి రావడం అందరినీ ఆలోచనలో పడేసింది.

సుమేధ కేసులో ఆమె తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. సెక్షన్‌ 304 కింద కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నపాటి వర్షాలకే దీన్‌దయాల్‌నగర్‌ కాలనీలో నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయన్నారు. ఘటన స్థలంలో నీటి ఉధృతిని చూశాక.. సుమేధ నాలాలో కొట్టుకుపోయే మృతిచెందినట్టుగా నిర్ధారించామని నేరేడ్‌మెట్‌ సీఐ నర్సింహాచారి చెబుతున్నారు.

పోలీసుల వెర్షన్‌ ఇలా ఉంటే మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వాదన మరోలా ఉంది. చిన్నారి సుమేధ మృతిపై తమకు అనుమానం ఉందన్న ఆయన.. ఆ రోజు ఆ ప్రాంతంలో వర్షం పడలేదంటున్నారు. మోకాలు లోతు వరకు కూడా నీరు నిల్వలేనట్టు గుర్తించామన్నారు. నాలాలో పడి మృతదేహం రెండు కిలోమీటర్ల వరకు కొట్టుకు వెళ్లే అవకాశమే లేదన్న బొంతు రామ్మోహన్‌.. పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి హెచ్చార్సీకి నివేదిక అందజేస్తామన్నారు.

కన్నబిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న సుమేధ తల్లి సుకన్య మాత్రం.. మున్సిపల్‌ అధికారుల తీరు మారాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు పెడితే కానీ చర్యలు తీసుకుంటామని చెప్పడం కరెక్ట్‌ కాదన్నారు. తాత్కాలిక మరమ్మత్తులు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు మిస్సింగ్‌పై ఫిర్యాదు చేసినప్పుడే సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభిస్తే కనీసం గాయాలతోనైనా బతికేదని సుమేధ తల్లి సుకన్య అంటున్నారు.

అటు.. దీన్‌దయాల్‌నగర్‌ కాలనీ వాసులు వర్షం అంటేనే వణికిపోతున్నారు. సుమేధ మృతి తర్వాత మళ్లీ వర్షాలు పడుతుండడంతో భయాందోళన మధ్య బతుకుతున్నారు. తమ కాలనీలో ఉండే నాలాకు 90 కాలనీల నాలాలను అనుసంధానం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. తాత్కాలికం కాకుండా నాలాలకు శాశ్వత పరిష్కారం చూపాలని దీన్‌దయాల్‌ కాలనీ వాసులు కోరుతున్నారు. నిజాంకాలం నాటి నాలాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

మరోవైపు సుమేధ మృతిపై ప్రముఖ న్యాయవాది మామిడి వేణు మాధవ్ మానవ హక్కుల కమిషన్‌లో ఇప్పటికే ఫిర్యాదుచేశారు. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఫిర్కాదులో కోరారు. నగరంలో ఓపెన్ నాలలు మృత్యు కుహరాలుగా మారుతూ పిల్లల ప్రాణాలు తీస్తూ… తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నాయంటూ పిటిషన్ లో న్యాయవాది పేర్కొన్నారు.

వర్షాకాలంలో ఇటువంటి ఘటనలు తరుచుగా జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ న్యాయవాది కమిషన్ కు వివరించారు. ఓపెన్ నాలలపై కప్పులు వేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయాలని న్యాయవాది డిమాండ్ చేసారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేశించాలంటూ న్యాయవాది కమిషన్ కోరారు.

చిన్నారి సుమేధ మరణంపై అందిన ఫిర్యాదుపై స్పందించిన కమిషన్, ఘటనపై సమగ్ర విచారణ జరిపి నవంబర్ 13లోగా నివేదికను సమర్పించాలంటూ… జిహెచ్ఎంసి కమిషనర్ ను హెచ్చార్సీ ఆదేశింది.

Follow Us