AP Curfew : తొలిరోజు ఏపీ కర్ఫ్యూలో “సిత్రాలు”.. బంగారం, మందు, మాంసం దుకాణాలపై ఎగబడ్డ జనం.. రాష్ట్ర సరిహద్దులు మూసివేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. దీంతో ఇవాళ్టి నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.

AP Curfew : తొలిరోజు ఏపీ కర్ఫ్యూలో సిత్రాలు.. బంగారం, మందు, మాంసం దుకాణాలపై ఎగబడ్డ జనం.. రాష్ట్ర సరిహద్దులు మూసివేత
Curfew Strict Rules In Andhra Pradesh Heavy Rush
Follow us

|

Updated on: May 05, 2021 | 9:17 PM

AP Curfew Strict Rules: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. దీంతో ఇవాళ్టి నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. బుధవారం నుంచి మధ్యాహ్నం 12 తర్వాత కఠినమైన ఆంక్షలు అమలు అవుతున్నాయి. దీంతో ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజా రవాణా వాహనాలు నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు వంటివి మధ్యాహ్నం తర్వాత నిలిచిపోయాయి. ఇకపై బస్సులు తిరిగేందుకు ఆరుగంటలే సమయం. ఆయా జిల్లాల పరిధిలోని, పక్క జిల్లాలకు వెళ్లే సర్వీసులనే ఆర్టీసీ నడపనుంది.

మరోవైపు ఇతర రాష్ట్రాలకు తిరిగే సర్వీసులు అన్నింటినీ నిలిపేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే బెంగళూరు, చెన్నైకు బస్సులు నిలిపివేయగా.. తాజాగా హైదరాబాద్‌కు సర్వీసులు ఆపేశారు. దూర ప్రాంత సర్వీసులు దాదాపు నిలిపేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే 50% సీట్ల సామర్థ్యంతో నడుపుతుండగా.. బుధవారం నుంచి కనీసం 85 శాతం సీట్లలో ప్రయాణికులు నిండితేనే బస్సులు బయలుదేరనున్నాయి. ఓ ప్రాంతానికి వెళ్లే రెండు, మూడు సర్వీసులను కలిపి ఒకే సర్వీసుగా పంపనున్నారు. బస్టాండ్లకు వచ్చే ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులు నడుపుతామని అధికారులు తెలిపారు. రాష్ట్ర సచివాలయ, హైకోర్టు ఉద్యోగుల కోసం నడిపే సర్వీసులు అన్నింటినీ మాత్రం కొనసాగిస్తారు. ఇక, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా నడుస్తు్న్న బస్సులు యధావిథిగా నడుస్తాయని అధికారులు తెలిపారు.

ఇదిలావుంటే, ముందు చూపు ఒకరిది. మందు చూపు ఇంకొకరిది. కరోనా ఆంక్షలతో ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఏపీ కర్ఫ్యూలో కనిపించిన దృశ్యాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. నిత్యావసరాలు సమకూర్చుకున్న వారు కొందరైతే… ఎక్కడ మందు అయిపోతుందో అన్న ఆత్రం ఇంకొకరిలో కనిపించింది. అదే స్థాయిలో బంగారం షాపుల ముందు కూడా క్యూలు కనిపించడం ఇంకా ఆశ్చర్యం కలిగించింది.

ఏపీలో కర్ఫ్యూ కఠినంగా అమలు అవుతోంది. మధ్యాహ్నం నుంచి ఉదయం 6 గంటల వరకు అన్నీ క్లోజ్‌ చేస్తున్నారు. రెండు వారాలపాటు అంటే ఈ నెల 18 వరకు ఈ తరహా ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఏపీలో భారీగా కేసులు నమోదవుతున్న వేళ ప్రభుత్వం ఈ తరహా ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చింది. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపునిచ్చింది. కర్ఫ్యూతోపాటు 144 సెక్షన్‌ అమల్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. రైతు బజార్లు, మినీ రైతు బజార్లు, ఇతర దుకాణాలు, షాపింగ్ మాల్స్‌, ఆర్టీసీ బస్సులు, ఇతర పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుపై కూడా ఆంక్షలు పెట్టింది.

ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిసిన ప్రజలు దుకాణాలపై ఒక్కసారిగా పడ్డారు. కూరగాయలు, ఇతర నిత్యవసరాలు కొనేందుకు ఎగబడ్డారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. మాస్క్‌ ధరించినప్పటికీ ఫిజికల్ డిస్టెన్స్‌ మాత్రం మరిచారు. విజయవాడ లాంటి నగరాల్లో నాన్‌వెజ్‌ మార్కెట్లు కిక్కిరిశాయి. వీటి కొరత ఏర్పడుతుందన్న ఆందోళనతో ఎగబడ్డం కాస్త రీజనబుల్‌ అనుకోవచ్చు కానీ. మందుకు కోసం ఎగబడ్డ వారు కూడా ఉన్నారు. ఎవరు ఎలా పోతే మాకేంటి మాకు చుక్కకు మించింది లేదంటూ వైన్‌ షాపుల ముందు క్యూ కట్టారు. 12 గంటలకే మందు షాపులు కూడా మూసేవేశారు. అందుకే మందుప్రియులు ఎగబడ్డారు. ఏదో ఫ్రీగా ఇస్తున్నారు… ఇవాళ ఒక్కరోజే ఆఫర్‌ అన్నట్టు మందు కోసం వాలిపోయారు.

అటు, విశాఖ జిల్లాలోని చోడవరం, మాడుగుల ప్రాంతాల్లో బంగారం దుకాణాలు కిటకిట లాడాయి. ఆలోచించిన ఆశాభంగం అన్నట్టుగా గోల్డ్ షాప్ ల ముందు క్యూ కట్టారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో స్వర్ణాభరణాల కొనుగోలుకు ఎగబడుతున్నారు ప్రజలు. పెళ్లిళ్లు వాయిదా వెయ్యటమంటే సెంటిమెంట్‌గా ఫీల్‌ అవుతున్నారు. అందుకే అనుకున్న టైంకి వివాహాలు జరిపించేస్తున్నారు. ప్రభుత్వం ఎక్కడ పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలు చేస్తాందోపెళ్లివారు బంగారం కొనుగోలుకు మొగ్గుతున్నారు.

మరోవైపు, ఆర్టీసీ మాత్రమే కాదు ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులు సైతం ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు నడిచే సర్వీసులకే అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలు పాటించాలంటూ ప్రైవేట్‌ బన్‌ ఆపరేటర్ల సంఘం నేతలు.. అందులోని సభ్యులందరికీ అధికారులు తెలియజేశారు. ఇప్పటికే ప్రయాణికులు లేక 80 % సర్వీసులు ఆపేశామని, కర్ఫ్యూతో మిగిలిన సర్వీసులు దాదాపు నిలిచిపోయాయని బస్సుల యజమానులు అంటున్నారు.

మరోవైపు, ఏపీ సరిహద్దు వద్ద పబ్లిక్ వాహనాలపై ఆంక్షలు విధించారు. అత్యవసర వాహనాలు, గూడ్స్, ట్రాన్స్‌పోర్ట్ వాహనాల మినహాయించి ఇతర ఏ వాహనాలకు అనుమతి లేదని ఏపీ పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి.. ఉదయం ఆరు గంటల వరకు ఈ ఆంక్షలు అమలు చేస్తున్నామని తెలిపారు. రెండు వారాలపాటు ఏపీ బార్డర్లో ఈ ఆంక్షలే అమలులో ఉంటాయని.. వాహనదారులు గమనించాలని కోరారు. అలాగే నిత్యావసరాలు, ఇతర సరుకులు రవాణా చేసే వాహనాలకు మాత్రం అనుమతి ఉంది.. వారికి కర్ఫ్యూ ఆంక్షలు వర్తించవని అధికారులు తెలిపారు. అయితే, లోడింగ్, అన్ లోడింగ్ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపే చేయాల్సి ఉంటుంది. వైద్య ఆరోగ్యానికి సంబంధించిన మందులు, ఇతర వస్తువులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.

Read Also…  ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. రేపట్నుంచి బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..