Andhra Pradesh: ఇంటిపక్కన జెర్రిపోతుల సయ్యాట.. పట్టుకోవడానికి వెళ్లిన స్నేక్ క్యాచర్ను చుట్టుకొని.. మీరే వీడియో చూడండి..
జనావాసాల మధ్య ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. ప్రకాశం జిల్లాలో ఓ ఇంటి ఆవరణ పక్కన రెండు పాములు పెనవేసుకుని కలకలం సృష్టించాయి. వాటి సయ్యాటలను చూసి గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

జనావాసాల మధ్య అకస్మాత్తుగా రెండు పాములు ప్రత్యక్షమై కలకలం సృష్టించాయి. ఆ రెండు పాములు ఒకదానికొకటి పెనవేసుకుని సయ్యాటలు ఆడటం చూసిన స్థానికులు ఒకవైపు ఆశ్చర్యానికి గురవ్వగా, మరోవైపు తీవ్ర భయాందోళనలతో వణికిపోయారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో చోటుచేసుకుంది. త్రిపురాంతకం మండలం ఎండూరివారి పాలెం గ్రామానికి చెందిన బొజ్జా కుమార్ అనే వ్యక్తి ఇంటి ఆవరణ పక్కన హఠాత్తుగా రెండు భారీ జెర్రిపోతు పాములు ప్రత్యక్షమయ్యాయి. అవి రెండు ఒకదానినొకటి అల్లుకుని, సయ్యాటలు ఆడటం ప్రారంభించాయి. ఆ శబ్దాలు, వింత దృశ్యాన్ని గమనించిన ఇంటి యజమాని, గ్రామాస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే స్నేక్ క్యాచర్ మల్లికార్జున హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెనవేసుకుని ఉన్న ఆ రెండు జెర్రిపోతులను చాకచక్యంగా పట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆ పాములు స్నేక్ క్యాచర్ చేతులకు, కాళ్లకు గట్టిగా మెలికలు వేసుకోవడంతో చుట్టూ ఉన్న జనం షాక్ అయ్యారు. అయినప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించిన మల్లికార్జున ఆ రెండు పాములను సురక్షితంగా పట్టుకుని గోనె సంచిలో బంధించారు.
సంతానోత్పత్తి కోసమే ఈ సయ్యాటలు..
పాములు ఇలా పెనవేసుకోవడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని స్నేక్ క్యాచర్ మల్లికార్జున వివరించారు. సాధారణంగా పాముల జీవన విధానంలో భాగంగా సంతానోత్పత్తి కోసమే ఇవి ఇలా కలుస్తుంటాయని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో లేదా వాతావరణం అనుకూలంగా ఉన్న సమయంలో పాములు జతకడతాయని, ప్రజలు వీటిని చూసి మూఢనమ్మకాలతో భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పట్టుబడిన ఆ రెండు జెర్రిపోతు పాములను ఊరికి దూరంగా ఉన్న మైదాన ప్రాంతంలో, అడవిలో సురక్షితంగా వదిలేయడంతో ఎండూరివారి పాలెం గ్రామస్తులు, వీధి ప్రజలు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
