ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.. మీకు ఇదే పరిస్థితి రావచ్చు
ఒకప్పుడు కాల్ మనీ అనే పదం వినగానే ప్రజలు వణికిపోయేవారు. అప్పు తీసుకుంటే వడ్డీ భారంతోనే బాధపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత భయంకరంగా మారింది. వడ్డీ వ్యాపారం పేరుతో ప్రారంభమైన వ్యవహారం, చివరకు బ్లాక్ మెయిల్గా మారి వ్యాపారులను, మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్న ఆరోపణలు బెజవాడలో సంచలనం రేపుతున్నాయి.

విజయవాడలో కాల్మనీ కొత్త రూపం దాల్చింది. వడ్డీ వ్యాపారం పేరుతో మొదలై జనాల పాలిట శాపంగా మారుతోంది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోని వన్టౌన్, కొత్తపేట, గవర్నర్ పేట ప్రాంతాల్లో ఈ ముఠా కార్యకలాపాలు శృతిమించుతున్నాయి. దీంతో బాధితులు భయంతో వణికి పోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరమైన వారికి వడ్డీకి అప్పు ఇస్తామని నమ్మకం కల్పించి, ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకోని ఆ తర్వాత వాటితోనే బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు పూర్తిగా తిరిగి చెల్లించిన తర్వాత కూడా ఆ చెక్కులు తిరిగి ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ, తరువాత వాటిని మరో వ్యక్తికి అప్పగించి కోర్టు కేసులు వేయిస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ విధంగా చెక్కులను ఆయుధంగా మార్చి భారీ మొత్తాలు డిమాండ్ చేస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంలో మార్వాడి వ్యక్తి తరుణ్ కోటారి కీలక పాత్ర పోషిస్తున్నాడని చెబుతున్నారు. గొల్లపాలెం గట్టు ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తి కూడా ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛంద సేవలు, మీడియా పరిచయాల పేరుతో పరిచయాలు పెంచుకుని బాధితులను మానసికంగా భయపెడుతున్నారని చెబుతున్నారు. చెక్కులు ఆధారంగా కోర్టుల్లో కేసులు వేయించి భారీ మొత్తాలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని బాధితులు చెబుతున్నారు.
వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలోని పాత శివాలయం సమీపంలో బ్యాగుల వ్యాపారి డబ్బులు పూర్తిగా చెల్లించినప్పటికీ తరువాత కోర్టు కేసు ఎదుర్కొన్న ఘటన వెలుగులోకి వచ్చింది. మరో వ్యాపారి ఇంటికి పలుమార్లు వెళ్లి డబ్బులు ఇవ్వాలని హంగామా చేసిన సంఘటన కూడా బయటపడింది. మహిళా వ్యాపారిపై బెదిరింపులు జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఫోన్ కాల్స్, పోలీస్ కేసుల బెదిరింపులు, వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారాలు.. ఇలా వివిధ మార్గాల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
తరుణ్ కోటారి పై ఇటీవల మూడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. ఇతరుల వద్ద ఉన్న ప్రామిసరీ నోట్లు, చెక్కులను సేకరించి వ్యాపారులపై బ్లాక్ మెయిల్కు పాల్పడి వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
