AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం.. తిరుపతి, తిరుమలలో ఉచిత టోకెన్ల జారీ..

TTD News: తిరుపతి, తిరుమలలో జనవరి 9 న ఉదయం 5 గంటలకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌న టోకెన్లు ఉచితంగా జారీ చేయనున్నారు. జనవరి 10, 11, 12 తేదీలకు 1.20 లక్షల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు. ఈ టోకెన్లు జనవరి 9 వ తేదీన ఉదయం 5 గంటలకు జారీ చేస్తారు. మిగిలిన రోజులకు సంబంధించిన టోకన్లు ఏరోజుకు ఆ రోజు ముందు జారీ చేస్తారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదు.

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం.. తిరుపతి, తిరుమలలో  ఉచిత టోకెన్ల జారీ..
Tirumala
Janardhan Veluru
|

Updated on: Dec 25, 2024 | 7:31 PM

Share

తిరుమల, 2024 డిసెంబర్ 25: తిరుపతి, తిరుమలలో జనవరి 9 న ఉదయం 5 గంటలకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌న టోకెన్లు ఉచితంగా జారీ చేయనున్నారు. జనవరి 10 నుండి 19వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో ఆ రోజున సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి ఈవో శ్రీ శ్యామలరావు వెల్లడించారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు చేస్తామని తెలిపారు.  తదుపరి రోజులకు ఏ రోజుకారోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు.

తిరుప‌తిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, మునిసిపల్ గ్రౌండ్, శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, ఎం.ఆర్. పల్లి స్కూల్ లతో పాటు తిరుమలలో బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ లో తిరుమల స్థానికుల కొరకు కౌంట‌ర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్ లను జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు.

కౌంట‌ర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో ప్ర‌త్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భ‌క్తుల‌కు తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని వివ‌రించారు. స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమ‌ల‌కు వ‌చ్చి స్వామివారి దర్శించుకోవాలని విజ్ఞప్తి.

తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టిటిడి అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, టిటిడి జేఈవో శ్రీమతి గౌతమి, జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, సివిఎస్వో శ్రీ శ్రీధర్ లతో కలిసి ఈవో తనిఖీ చేశారు. ఈవో వెంట సీఈ శ్రీ స‌త్య‌నారాయ‌ణ, ఎస్.ఈ శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, శ్రీ మనోహర్, ట్రాన్స్ ఫోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి, తదితర టిటిడి అధికారులు, పోలీసు, రెవిన్యూ అధికారులు ఉన్నారు.

జనవరి 5న స్థానికులకు శ్రీవారి దర్శనం టోకెన్లు జారీ

కాగా శ్రీవారి దర్శనార్థం తిరుపతి స్థానికులకు 2025, జనవరి 5న (ఆదివారం) స్థానిక దర్శన కోటా టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. గత టిటిడి బోర్డులో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.

2025, జనవరి 7వ తేదీ మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు జనవరి 5న (ఆదివారం) తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల బాలాజీ నగర్ లో శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.

తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందవలసి ఉంటుంది.