Tirumala: శ్రీవారి దర్శనం టికెట్ల బుకింగ్స్లో మార్పులు.. టీటీడీ కీలక అప్డేట్.. భక్తులందరికీ ప్రయోజనం
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల బుకింగ్స్లో మార్పులు చేసింది. ఇటీవల ఆన్లైన్ బుకింగ్ విధానంలో టీటీడీ మార్పులు చేస్తోంది. అందులో భాగంగా తాజాగా మరో రూల్ తీసుకొచ్చింది. దీని వల్ల భక్తులకు ప్రయోజనం కలగనుంది.

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది. శుక్రవారం నుంచి కొత్త రూల్స్ను టీటీడీ అమల్లోకి తెచ్చింది. శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇచ్చినవారు రూ.500 అదనంగా చెల్లించి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్కు విరాళం ఇచ్చిన తర్వాత దర్శనం టికెట్కు రూ.500 చెల్లించేలోపు టికెట్ అయిపోయినట్లు చూపిస్తోంది. దీంతో ఈ విషయంపై భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. శ్రీవాణి ట్రస్ట్కు విరాళం ఇచ్చినవారు వీఐపీ బ్రేక్ దర్శనానికి టికెట్లు బుక్ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన టీటీడీ.. టికెట్ల బుకింగ్ విషయంలో మార్పులకు శ్రీకారం చుట్టింది.
నేటి నుంచే అమలు..
ఇక నుంచి శ్రీవాణి ట్రస్ట్కు రూ.10 వేలు, వీఐపీ బ్రేక్ దర్శనానికి రూ.500 ఒకేసారి చెల్లించవచ్చు. అంటే రూ.10,500 ఒకేసారి చెల్లించవచ్చు. దీని వల్ల టికెట్లు వెంటనే బుక్ అవుతాయి. టికెట్ కోసం ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ మార్పులను అమలు చేసేందుకు పేమెంట్ గేట్వేకు సంబంధించి యూనియన్ బ్యాంక్ ఇండియాకు టీటీడీ బాధ్యతలు అప్పగించింది. దీంతో భక్తులు యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఒకేసారి చెల్లింపులు చేయవచ్చు.
వారానికి ఒకసారి మాత్రమే
అయితే ఈ ఏడాది జనవరి 9వ తేదీ నుంచి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఆన్లైన్లో జారీ చేస్తోంది. ప్రతీ రోజు 800 టికెట్లను జారీ చేస్తోంది. ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో టికెట్లను విడుదల చేస్తారు. కేవలం 1+3 భక్తులకు మాత్రమే బుక్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఒక ఐడీపై టికెట్ బుక్ చేసుకుంటే మళ్లీ వారంపాటు ఆ ఐడీపై టికెట్ బుక్ చేసుకోలేరు.
