Andhra: పదో తరగతి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్ను కాటేసిన పాము
ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మార్చి 17 న ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి. అయితే ఇటీవల పదో తరగతి విద్యార్థికి పాము కాటు ఘటన మరువక ముందే ఈసారి ఇన్విజిలేటర్ను పాము కాటేసింది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట వేద స్కూల్లో ఈ ఘటన జరిగింది. టెన్త్ పరీక్షల ఛీప్ సూపరింటెండెంట్ కరిముల్లాకు పాము కాటు వేసింది.

పరీక్షా కేంద్రంలో విధుల్లో ఉండగానే ఇన్విజిలేటర్ను పాము కాటేయడం కలకలం రేపింది. ఏపీలోని చిలకలూరిపేటలో ఈ ఘటన వెలుగుచూసింది. పాముకాటుకు గురైన కరీముల్లాను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. పరీక్షా కేంద్రంలో పాము కాటు విషయం తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. స్కూళ్లల్లోకి పాములు చొరబడుతుంటే ఏం చేస్తున్నారని నిర్వాహకులపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు పాము కరిస్తే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నించారు.
సాధారణంగా పాములు.. పొలాలు, అడవులు, ఏజెన్సీ ప్రాంతాల్లో… నీటి వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే సంచరిస్తూ ఉంటాయి. అయితే అడవులు క్రమంగా తగ్గిపోవడం వల్ల పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. దీనికి తోడు పారిశ్రామికీకరణ వల్ల నీటి కాలుష్యం పెరగడంతో అవి బయట తిరుగుతున్నాయి. అందునా ఇప్పుడు వేసవి సమీపించడంతో.. వేడి తాపానికి నీటి కోసం అవి జనాలు ఉండే ప్రాంతాలకు వస్తున్నాయి. పాము కరచినపుడు నాటు వైద్యం, మంత్రవైద్యం కాకుండా తప్పనిసరిగా ఆసుపత్రుల్లోనే చికిత్స తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం ఉండరాదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..