ఏపీలో పంచాయతీ సమరం : ఏకగ్రీవాలపై ఎస్ఈసీ స్పెషల్ ఫోకస్.. ఏవైనా అవకతవకలు జరిగితే..!
ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి ఏవైనా అవకతవకలు జరిగాయని నిర్ధారణకు వస్తే సంబంధిత ఆర్వో, ఏఆర్వోలపై కూడా చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా...
ఏపీలో లోకల్ ఫైట్.. ఎత్తులు.. పై ఎత్తులు. వివాదాలు.. వితండ వాదాలు. పంచాయతీ సమరం పంతాలు, కాంట్రోవర్సికి కేరాఫ్గా మారింది. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న సమయంలో మరి వివాదం ఎంట్రీ ఇచ్చింది. అదే ఆన్లైన్ నామినేషన్స్.. ఆన్లైన్ నామినేషన్ తీసుకోవాలా? వద్దా? దీనికి ఎన్నిక సంఘం ఒప్పుకుంటుందా? లేదా? ఇప్పుడు ఇది మరో తలనొప్పిగా మారింది.
ఏకగ్రీవం అయిన పంచాయతీలకు భారీ నజరానా ప్రకటించింది ప్రభుత్వం. దీంతో నామినేషన్ వేసేందుకు యత్నించిన వారిపై అధికార పార్టీ దాడులు చేస్తోందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి . ఈ క్రమంలో ఆన్లైన్ నామినేషన్ను ప్రవేశపెట్టాలని కోరుతున్నాయి. మరి ఈ ఆలోచన ఎస్ఈసీ దృష్టిలో ఉందా? సాధ్యాసాధ్యాలేంటి అన్నది.. ఇప్పుడు మరో చర్చకు దారితీసింది.
ఇదలా ఉంటే ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ పునరుద్ఘాటించారు. ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి ఏవైనా అవకతవకలు జరిగాయని నిర్ధారణకు వస్తే సంబంధిత ఆర్వో, ఏఆర్వోలపై కూడా చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, అంకితభావంతో నిర్వహించాలన్నారు.
మరోవైపు నిమ్మగడ్డపై సజ్జల సంచలన కామెంట్స్ చేశారు. ఎస్ఈసీ రమేష్కుమార్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు కుట్రలో నిమ్మగడ్డ సూత్రధారిగా మారారన్నారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిన ఆయన.. అధికారులపై దుందుడుకుగా దాడికి సిద్ధమయ్యారని, ఇది ఫ్యాక్షనిస్టు ధోరణిని తలపిస్తోందన్నారు. అటు పెద్దిరెడ్డి కూడా నిమ్మగడ్డపై తనదైన స్టయిల్లో విరుచుకుపడ్డారు.