IPL 2026 SRH : ఈసారి కూడా 250 రన్స్ ఖాయమే.. కానీ ఆ పరుగులను సన్ రైజర్స్ కాపాడుకుంటుందా ?
IPL 2026 SRH : ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వకముందే సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) క్యాంప్లో అలజడి మొదలైంది. ఒకవైపు విధ్వంసకర బ్యాటింగ్ లైనప్తో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న ఈ జట్టుకు, మరోవైపు బౌలింగ్ విభాగం అతిపెద్ద శాపంగా మారేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ దూరమవ్వడం ఆరెంజ్ ఆర్మీకి గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

IPL 2026 SRH :సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును చూస్తుంటే ఒక పవర్ఫుల్ బ్యాటింగ్ మెషీన్ లా కనిపిస్తోంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి ఓపెనర్లు క్రీజులోకి వస్తే పవర్ ప్లేలోనే స్కోరు బోర్డును పరుగులెత్తిస్తారు. వీరికి తోడుగా ఇప్పుడు ఇషాన్ కిషన్ చేరడం జట్టుకు మరింత బలాన్ని ఇచ్చింది. ఇక మిడిల్ ఆర్డర్లో హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈసారి కొత్తగా జట్టులోకి వచ్చిన లియామ్ లివింగ్స్టన్ కూడా తోడవ్వడంతో, ఎస్ఆర్హెచ్ ప్రతి మ్యాచ్లోనూ 250 పరుగుల మార్కును సులువుగా దాటే అవకాశం ఉంది. గత సీజన్లో వారు సృష్టించిన విధ్వంసం ఈసారి కూడా రిపీట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
జట్టు ఎంత పటిష్టంగా ఉన్నా, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడం పెద్ద మైనస్. వెన్ను గాయం కారణంగా కమిన్స్ ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్లకు దూరం కానున్నట్లు ఫ్రాంచైజీ ధృవీకరించింది. కమిన్స్ కేవలం బౌలర్ మాత్రమే కాదు, జట్టును ముందుండి నడిపించే వ్యూహకర్త. అతని గైర్హాజరీలో బౌలింగ్ బాధ్యతలు హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఈశాన్ మలింగ వంటి వారిపై పడ్డాయి. వీరిలో అనుభవం ఉన్నా, కీలక సమయంలో వికెట్లు తీయడంలో తడబడుతున్నారు. స్పిన్ విభాగంలో కూడా చెప్పుకోదగ్గ స్టార్ ప్లేయర్ లేకపోవడం ఎస్ఆర్హెచ్ను ఆందోళనకు గురిచేస్తోంది.
గణాంకాలను పరిశీలిస్తే 2022 నుంచి ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ బౌలర్లు దాదాపు 19 సార్లు 200కు పైగా పరుగులు సమర్పించుకున్నారు. దీన్ని బట్టి వారి బౌలింగ్ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్యాటర్లు ఎంత కష్టపడి భారీ స్కోరు సాధించినా, బౌలర్లు దాన్ని కాపాడుకోలేకపోతే జట్టుకు ఓటమి తప్పదు. ప్యాట్ కమిన్స్ వచ్చే వరకు జట్టును గట్టెక్కించే బాధ్యత ఇషాన్ కిషన్పై ఉంది. తాత్కాలిక కెప్టెన్గా ఇషాన్ తన బ్యాటింగ్తో పాటు కెప్టెన్సీలోనూ సత్తా చాటాల్సి ఉంది. నితీష్ కుమార్ రెడ్డి వంటి యంగ్ ఆల్ రౌండర్లు బౌలింగ్లో రాణిస్తేనే హైదరాబాద్కు విజయాలు దక్కుతాయి.
ఈసారి వేలంలో ఎస్ఆర్హెచ్ బ్యాలెన్సింగ్ జట్టును ఎంచుకోవడానికి ప్రయత్నించింది. జట్టులో ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ స్మరణ్, కమిందు మెండిస్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్స్, ఈశాన్ మలింగ, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, శివాంగ్ కుమార్, సలీల్ అరోరా, ప్రఫుల్ హింజే, క్రెన్స్ ఫులేత్రా, అమిత్ కుమార్, ఓంకర్ తర్మాలే, సాకిబ్ హుస్సేన్, శివం మావి, జాక్ ఎడ్వర్డ్స్, లియామ్ లివింగ్స్టన్, అనికేత్ వర్మ వంటి ప్లేయర్లు ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
