AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Weather: ఏపీలో సోమవారం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం విభిన్నంగా మారుతోంది. ఒకవైపు భానుడు నిప్పులు చెరుగుతుండగా, మరోవైపు పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Andhra Weather: ఏపీలో సోమవారం ఎలా  ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి..
Andhra Weather
Ram Naramaneni
|

Updated on: May 31, 2026 | 8:18 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడు నిప్పులు చెరుగుతుండగా.. మరోవైపు పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రకర్ జైన్ తెలిపారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ చెదురుమదురుగా వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

అయితే వర్షాల ప్రభావం ఉన్నప్పటికీ ఎండల తీవ్రత మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నంద్యాల, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని హెచ్చరించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మొత్తానికి రాష్ట్రంలో ఒకవైపు ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు వాతావరణాన్ని అనిశ్చితంగా మార్చుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us