అమెరికా గడ్డపై పులివెందుల కుర్రాడి సంచలనం.. 25 ఏళ్లకే డ్యూయల్ లైసెన్స్.. నారా లోకేష్ ఏమన్నారంటే..
కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి చెందిన సాయి శ్రీనివాస్ రెడ్డి కేవలం 25 ఏళ్ల వయసులోనే అమెరికా, భారతదేశాల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేందుకు డ్యూయల్ లైసెన్స్ సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇండియానా స్టేట్లో లైసెన్స్డ్ అటార్నీగా గుర్తింపు పొందిన ఆయన.. తొలి ప్రయత్నంలోనే కఠినమైన పరీక్షను క్లియర్ చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి చెందిన ఒక యువకుడు కేవలం 25 ఏళ్ల వయసులోనే అమెరికాలో డ్యూయల్ లైసెన్స్ సాధించి సంచలనం సృష్టించాడు. సాయి శ్రీనివాస్ రెడ్డి.. అతి చిన్న వయసులోనే ఈ అరుదైన ఘనతను తన సొంతం చేసుకుని వార్తల్లో నిలిచాడు. శ్రీనివాస్ రెడ్డి ప్రముఖ రాజకీయ నేత, శాసనమండలి సభ్యుడు రామగోపాల్ రెడ్డి కుమారుడు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకోవాలని ఎప్పటినుంచో ఆరాటపడ్డాడు. తన చదువుపై పూర్తి ఏకాగ్రత పెట్టి ఈ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. సాయి శ్రీనివాస్ రెడ్డి పాతికేళ్ల వయసులోనే అమెరికాలోని ఇండియానా స్టేట్లో లైసెన్స్డ్ అటార్నీగా గుర్తింపు పొందాడు. న్యాయశాస్త్రంలో ఎంతో కఠినంగా ఉండే ఈ పరీక్షను తన తొలి ప్రయత్నంలోనే పూర్తి చేయడం విశేషం.. ఎంతో మందికి సాధ్యం కాని ఈ అరుదైన మైలురాయిని ఈ పులివెందుల కుర్రాడు చాలా సునాయాసంగా చేరుకున్నాడు.
అమెరికాలో మాత్రమే కాకుండా ఇండియాలో కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేందుకు ఈ యువకుడు డ్యూయల్ లైసెన్స్ సాధించాడు. అటు ఇండియా, ఇటు అమెరికాలో ఇలా రెండు దేశాల్లో అటార్నీగా పని చేసే అవకాశాన్ని పొందడం మామూలు విషయం కాదు. దీని వెనుక అతడి ఎన్నో ఏళ్ల కష్టం, నిరంతర శ్రమ దాగి ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సాయి శ్రీనివాస్ రెడ్డి కేవలం చదువుకే పరిమితం కాకుండా సామాజిక అంశాల పట్ల కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నాడు. విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రస్తుతం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తున్నాడు. రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూనే తన చదువులో కూడా అత్యుత్తమ ప్రతిభను కనబరచడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ యువకుడు సాధించిన భారీ విజయం పట్ల సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. తోటి మిత్రులు, బంధువులు, స్థానికులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వయసులో ఇంతటి విజయం నమోదు చేయడం పట్ల స్థానికంగా కూడా చర్చనీయాంశంగా మారింది. యువతకు ఇతడి ప్రయాణం ఒక చక్కటి ఆదర్శంగా నిలుస్తుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
సాయి శ్రీనివాస్ రెడ్డి అద్భుత ప్రతిభను గుర్తించిన నారా లోకేష్ ప్రత్యేకంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఈ యువకుడికి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పులివెందుల నుంచి వచ్చిన ఒక యువకుడు అమెరికా స్థాయిలో సత్తా చాటడం పట్ల తాను ఎంతో సంతోషిస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డికి ప్రత్యేకంగా తన శుభాకాంక్షలు అందించారు.
తెలుగు జాతికే ఇది ఎంతో గర్వకారణం అని నారా లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ అరుదైన ఘనత భవిష్యత్తులో మరెందరో తెలుగు యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అటార్నీగా వృత్తి జీవితాన్ని ప్రారంభించనున్న సాయి శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని పలువురు ప్రముఖులు సైతం మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
