Andhra Pradesh: మొన్న పులులు, నేడు చిరుత.. పల్నాడు జిల్లా వాసులను వణికిస్తున్న వన్య మృగాలు
ఈ మధ్య జనావాసాలోకి పులులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. నెలరోజుల క్రితం రెండు పెద్ద పులులు పల్నాడు జిల్లాలో ప్రత్యక్షమవ్వడం కాగా ఇప్పడు మరో చిరుత పులి సంచరించడం కలకలం రేపుతోంది.

ఈ మధ్య జనావాసాలోకి పులులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. నెలరోజుల క్రితం రెండు పెద్ద పులులు పల్నాడు జిల్లాలో ప్రత్యక్షమవ్వడం కాగా ఇప్పడు మరో చిరుత పులి సంచరించడం కలకలం రేపుతోంది. నాగార్జునసాగర్ శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ (NSTR)ను పులుల అభయారణ్యంగా మార్చిన విషయం తెలిసిందే. అయితే పల్నాడు ప్రాంతానికి అత్యంత్య సమీపంలోనే ఈ ఎన్ఎస్టీఆర్ ఉంది. అభయారణ్యం నుండి నెల రోజుల క్రితం బయటకొచ్చిన రెండు పులులు పల్నాడు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించాయి. అంతేకాకుండా దుర్గి మండలం గజాపురం పొలాల్లో ఆవుపై దాడి చేసి చంపేశాయి. ఆ తర్వాత రాజానగరం, కాకిరాలలో సంచరించినట్లు స్థానికులు గుర్తించారు.

Tigers
దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రెండు పులులు సంచరిస్తున్నట్లు గుర్తించామని అయితే అవి మనుషుల్ని తినేవి కాదని ప్రజలు భయపడవద్దని చెప్పారు. ఆ తర్వాత ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులులు కదలికలనును ట్రాక్ చేశారు. ఇరవై రోజుల తర్వాత తిరిగి అవి ఎన్ఎస్టిటీఆర్లోకి వెళ్ళిపోయినట్లు ట్రాప్ కెమెరాల ఆధారంగా గుర్తించారు. దీంతో పల్నాడు జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది జరిగిన నెల రోజుల తర్వాత గురజాల పట్టణంలో మరో చిరుత సంచారం కలకలం రేపింది. పట్టణంలోని మాడుగుల రోడ్డులోని జియో టవర్ వద్ద చిరుత సంచరించినట్లు స్థానికులు గుర్తించారు.

Tiger Footprints
వెంటనే అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. పాద ముద్రలను బట్టి నాలుగేళ్ళ వయస్సున్న చిరుతగా అధికారులు గుర్తించారు. ఈ చిరుత ఎటు వైఫు నుండి వచ్చింది ఎటు వెళ్తోంది అన్న అంశాన్ని తేల్చేందుకు ఐదు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. స్థానికులు ఎవరు భయపడవద్దని పల్నాడు జిల్లా డిఎఫ్వో రామచంద్రరావు చెప్పారు. చిరుతలు మనుషులుపై దాడి చేసే అవకాశం లేదని కేవలం వన్య ప్రాణులపైనే మాత్రమే దాడి చేస్తాయంటున్నారు. చిరుతను అడవిలోకి మళ్ళించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అయితే పెద్ద పులులు భయాందోళనలు తొలగిపోకముందే చిరుత సంచారంతో పల్నాడు వాసులు బెంబేలెత్తి పోతున్నారు.




(టీ.నాగరాజు, టివీ9 తెలుగు, గుంటూరు జిల్లా)