Vijayawada City: విజయవాడలో అమానుష ఘటన.. వైద్యుల నిర్లక్ష్యంతో అమ్మ అనే పిలుపునకు దూరమైన తల్లి..
Vijayawada City: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా...
Vijayawada City: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ‘అమ్మ’ అనే పిలుపునకు దూరమైంది. విజయవాడకు చెందిన ఓ మహిళ కడుపులో నొప్పిగా ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో ఆమెను పరీక్షించిన ఆస్పత్రి వైద్యులు.. ఆమె గర్భవతి అని చెప్పారు. దాంతో సదరు మహిళ ప్రతీ నెలా చెకప్ కోసం ప్రభుత్వం ఆస్పత్రికి వస్తోంది. అలా ప్రతీ నెలా వైద్యులు ఆమెను పరీక్షించడం.. మెడిసిన్స్ రాసి పంపించడం జరిగింది. అయితే, 10వ నెల దాటడంతో నొప్పులు రావడం లేదని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అయితే, నొప్పులు వచ్చాక రావాలంటూ సదరు మహిళను ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది వెనక్కి పంపించేశారు. అనుమానం వచ్చిన మహిళ, కుటుంబ సభ్యులు.. ప్రైవేటు ఆస్పత్రిలో టెస్టులు చేయించారు. మహిళను పరీక్షించిన వైద్యులు.. అసలు ఆమె కడుపులో పిండమే లేదని తేల్చారు. కడుపులో మొత్తం గడ్డ అయిపోయిందని ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ఇదే విషయమై అడిగేందుకు వచ్చినా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు స్పందించలేదు. పైగా బాధితుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. స్కానింగ్ ఆపరేటర్ లేదని, రేపు రావాలంటూ వెనక్కి పంపించేశారు. అయితే, పాత ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం ప్రదర్శించిన వైద్యుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే.. తమకు ఈ పరిస్థితి ఎదురైందని దుమ్మెత్తిపోతున్నారు. ఇక బాధిత మహిళ పరిస్థితి మరీ దయనీయం అని చెప్పాలి. తన కడుపులో బిడ్డ ఉందనుకుని 10 నెలల పాటు ఎంతో ఆశతో ఎదురు చూడగా.. చివరికి అది జరగకపోవడంతో కన్నీరుమున్నీరవుతోంది. మొత్తంగా ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ అమాయక మహిళ.. అమ్మా అని పిలిపించుకోలేకపోవడం బాధాకరం.
Also read: