Andhra Pradesh: ఏపీలో రైతులకు ముందే వచ్చిన దీపావళి.. ఒకే రోజు 3 పథకాల ద్వారా నగదు జమ

ఏపీలో రైతులకు జగన్ సర్కార్ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ ఫథకం కింద రెండో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు.

Andhra Pradesh: ఏపీలో రైతులకు ముందే వచ్చిన దీపావళి.. ఒకే రోజు 3 పథకాల ద్వారా నగదు జమ
Cm Jagan
Follow us

|

Updated on: Oct 25, 2021 | 9:53 PM

ఏపీలో రైతులకు జగన్ సర్కార్ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ ఫథకం కింద రెండో విడత నిధులను సీఎం జగన్  ఈనెల 26న (మంగళవారం) సీఎం జగన్ విడుదల చేయనున్నారు. 2020 ఖరీఫ్‌కు సంబంధించిన సున్నావడ్డీ పంట రుణాలు అందించనున్నారు.  వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద కూడా రైతుల ఖాతాల్లో నిధుల జమ ఉంటుంది. మీట నొక్కి డైరెక్ట్‌గా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.  ఇదివరకే ఆగష్టులో రెండో విడత వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ క్రింద జమ చేసిన సాయం రూ. 977 కోట్లు పోను, మిగిలిన మొత్తం రూ. 1,214 కోట్లు మంగళవారం జమ కానుంది.  వైఎస్సార్‌ రైతు భరోసా క్రింద వరుసగా మూడో ఏడాది కూడా అక్టోబర్‌లో  రెండవ విడతగా 50.37 లక్షల మంది రైతన్నలకు రూ. 2,052 కోట్ల లబ్ది చేకూరుస్తుంది ఏపీ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా క్రింద ఏటా రూ. 13,500 రైతు భరోసా సాయం ఏపీ సర్కార్ అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అందిస్తున్న సాయం రూ. 2,052 కోట్లతో కలిపి రెండున్నర సంవత్సరాలలో ఇప్పటివరకు రైతన్నలకు జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం రైతు భరోసా సాయం రూ. 18,777 కోట్లు అని అధికార వర్గాలు తెలిపాయి.

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు

ఈ పథకం క్రింద 6.67 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ. 112.7 కోట్ల వడ్డీ రాయితీ మంగళవారం జమ కానుంది. చక్రవడ్డీల పద్మవ్యూహంలో చిక్కుకుని అన్నదాతలు అప్పుల ఊబిలో పడిపోకుండా వారికి అండగా నిలుస్తూ ఇ–క్రాప్‌ డేటా ఆధారంగా లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకుని ఏడాది లోపు సమయానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు ఈ పథకం క్రింద పూర్తి వడ్డీ రాయితీని ఏపీ సర్కార్ అందిస్తోంది.

గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ. 1,180 కోట్లతో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద చెల్లించిన రూ. 382 కోట్లతో సహా, ఇప్పుడు అందిస్తున్న వడ్డీ రాయితీ రూ. 112.7 కోట్లతో కలిపి ఇప్పటివరకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం క్రింద 64.96 లక్షల మంది రైతన్నలకు రూ. 1,674 కోట్ల వడ్డీ రాయితీని  ప్రభుత్వం అందించింది.

 వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం

వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం క్రింద 1,720 రైతు గ్రూపులకు రూ. 25.55 కోట్ల నగదు మంగళవారం రైతుల ఖాతాల్లో జమ కానుంది. సన్న, చిన్నకారు రైతులకు అద్దె ప్రాతిపదికన సాగు యంత్రాలు, పనిముట్లను అందుబాటులో ఉంచి విత్తు నుండి కోత వరకు అవసరమైన యంత్ర పరికరాల కొరతను అధిగమించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,134 కోట్ల వ్యయంతో వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా 10,750 గ్రామ స్ధాయి యంత్రసేవా కేంద్రాలు (కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్స్‌), వరి ఎక్కువగా సాగయ్యే ఉభయ గోదావరి మరియు కృష్ణ, గుంటూరు జిల్లాలలో మండలానికి 5 చొప్పున 1,035 కంబైన్డ్‌ హార్వెస్టర్‌తో కూడిన క్లస్టర్‌ స్ధాయి యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుకు ఈ సాయం అందిస్తున్నారు.

కాగా, వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద డబ్బు తమ అకౌంట్లో పడిందో, లేదో తెలుసుకునేందుకు కొందరు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి ఏ సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 155251కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీ సమస్యలపై కంప్లైంట్ చేయవచ్చు. మరోవైపు ప్రభుత్వం రూపొందించిన వైఎస్సార్ రైతు భరోసా వెబ్‌సైట్ (YSR Rythu Bharosa Website)‌ లో రైతులు తమ ఖాతాల్లో నగదు స్టేటస్ వివరాలు తెలుసుకునే వెసులుబాటు ఉంది.

Also Read:  ‘ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ’.. విద్యార్థులకు మరో గుడ్ న్యూస్

ఎయిర్‌పోర్ట్‌లో పట్టాభి.. ఎక్కడికి వెళ్లారంటే.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి