Andhra: దారుణాతి దారుణం.. మానవత్వానికే మచ్చ
దారుణాతి దారుణం. మానవత్వానికే మచ్చ. ఇలాంటి పదాలు కూడా చాలా చిన్నవి. ఎందుకంటే.. ఇక్కడ జరిగిన ఘటనలు అలాంటివి. ఖర్మ బాగోలేక కాలం చెల్లిన వాళ్లను.. కాటికి పంపడానికి కూడా ఇబ్బందులు పెట్టిన ఘటన ఒకటైతే.. శ్మశానం కోసం శవాన్ని పట్టుకుని సమరం చేసిన ఉదంతం మరొకటి.

శవాన్ని తీసుకెళ్లనియ్యకుండా అడ్డుపడటంతో పోరాటం చేయాల్సిన దీనస్థితికి అద్దంపట్టిన ఘటన ఇది. పొలాల్లో నుంచి శవాన్ని మోసుకెళ్లి అంతిమ సంస్కారాలు చేసిన సంఘటన మరొకటి. దారుణమైన కులవివక్షకు అద్దం పట్టే ఘటనలు ఇవి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం కందాలపల్లికి చెందిన కాటు శ్రీనివాస్ ఈనెల 16న చనిపోయారు. మృతదేహానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేసేందుకు అంబేద్కర్ నగర్ నుంచి ప్రధాన రహదారి మీదుగా డెడ్బాడీ తీసుకెళ్తుంటే మరో సామాజికవర్గం వాళ్లు అడ్డుకున్నారు. శవాన్ని తమ వీధి నుంచి తీసుకెళ్లొద్దంటూ వాదించారు. పంటపొలాల్లోంచి తీసుకెళ్లాలంటూ తేల్చి చెప్పారు. దీంతో అంతిమయాత్రపై రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కొన్నాళ్ల క్రితం కూడా అక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. చేసేదేమీ లేక.. పంట పొలాల్లోంచే శవాన్ని మోసుకుంటూ వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారప్పుడు.
ఆ నియోజకవర్గం.. ఎస్సీ రిజర్వుడు. పైగా ఆ రోడ్డు వేసింది ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో. అలాంటి రోడ్డుపై తమనే వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటని ఎస్సీలు ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణంపై ఎస్సీ సంఘాల ఆందోళనలతో 10 మందిపై కేసు నమోదు చేశారు. మరోవైపు మాజీ ఎంపీ హర్షకుమార్.. ఆ గ్రామంలో పర్యటించారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇక.. మార్కాపురం జిల్లా కనిగిరి సమీపంలో కూడా అంత్యక్రియల కోసం అంతులేని పోరాటం చేయాల్సి వచ్చింది. బోయపాలెం గ్రామంలో 2 రోజుల క్రితం అంజమ్మ అనే మహిళ మృతి చెందింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానానికి తీసుకెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీనికి కారణం.. ఆ భూమి వివాదంలో ఉండటమే.
ఈ స్థలం ఎన్నో ఏళ్లుగా శ్మశానంగానే ఉందని స్థానికులు చెప్తున్నారు. కానీ.. ఆ భూమి తమదంటూ ఇటీవలే కొందరు వాదించారు. దీంతో ఆ స్థలం వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతానికి అక్కడ అంత్యక్రియలు నిర్వహించడానికి వీల్లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మృతదేహాన్ని ట్రాక్టర్లో అక్కడి నుంచి మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్లారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. మృతుడి కుటుంబసభ్యులతో పాటు స్థానికులు ఆందోళన చేశారు.
మనిషికి ఆస్తులు, బంధాలు శాశ్వతం కాదంటారు. బొందల గడ్డే శాశ్వత నివాసం అని కూడా అంటారు. అలాంటి శ్మశానంలోనే మనిషికి జాగా లేకుండా చేస్తే.. ఇంకేం చేయాలి?
