Andhra Pradesh: వ్యవసాయ బావిలో పడిన భారీ ఏనుగు.. రాత్రంతా అలాగే.. ఉదయం చూస్తే షాక్..
అడవి నుంచి తప్పిపోయి వచ్చిన ఏనుగు.. వ్యవసాయ క్షేత్రంలో ప్రమాదం బారిన పడింది. చికట్లో దారి కనిపించక వెళ్లి బావిలో పడిపోయింది. పైకి ఎక్కే మార్గం లేక రాత్రంతా..
అడవి నుంచి తప్పిపోయి వచ్చిన ఏనుగు.. వ్యవసాయ క్షేత్రంలో ప్రమాదం బారిన పడింది. చికట్లో దారి కనిపించక వెళ్లి బావిలో పడిపోయింది. పైకి ఎక్కే మార్గం లేక రాత్రంతా అందులోనే ఉండిపోయింది. ఉదయాన్నే వ్యవసాయ బావిలో అలజడిని విన్న స్థానిక రైతులు.. బావి వద్దకు చూశారు. అందులో ఏనుగు పడి ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే అలర్ట్ అయిన రైతులు.. గ్రామస్తులకు సమాచారం అందించారు. ఆ వెంటనే అటవీశాఖ అధికారులకు విషయం తెలియజేశారు. రంగంలోకి దిగిన అధికారులు ఆ ఏనుగును కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని బంగారు పాళ్యం మండలంలో చోటు చేసుకుంది ఈ ఘటన. దీనికి సంబంధించి స్థానికులు, అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కౌండిన్య అభయారణ్యం నుంచి వ్యవసాయక్షేత్రాల్లోకి వచ్చిన ఏనుగుల గుంపు నుంచి ఓ ఏనుగు తప్పిపోయింది. అలా తప్పిపోయిన ఏనుగు ఒంటరిగా దిక్కు తోచక స్థానికంగా హల్చల్ చేసింది. బంగారుపాళ్యం మండలంలోని టేకుమంద, బండ్లదొడ్డి, శ్రీని జ్యూస్ ఫ్యాక్టరీ, జాయతీ రహదారిపై హల్చల్ చేసింది. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.
ఇదే ఏనుగు ఇవాళ ఉదయం గాండ్లపల్లి గ్రామం వద్ద వ్యవసాయ బావిలో పడింది. జనాలను భయపెట్టిన ఏనుగు, బావిలో పడ్డ ఏనుగు రెండూ ఒకటేనని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరిన అధికారులు.. ఆ ఏనుగు, ఈ ఏనుగో ఒక్కటేనని నిర్ధారించారు. బావి నుంచి ఏనుగు బయటికి వచ్చేలా తవ్వకం చేపట్టారు. గ్రామస్తులు, రైతుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన ఏనుగును సేఫ్గా బయటకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు అటవీశాఖ అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..