Andhra Pradesh: ఏపీలో భూకంపం.. భయంతో ప్రజల పరుగులు.. రిక్టార్ స్కేలుపై..
ప్రశాంతంగా నిద్రపోతున్న పల్నాడు జిల్లా ప్రజలకు భూమి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. భూ ప్రకంపనలతో ప్రజలకు కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. భయాందోళనతో రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప కేంద్రం ఎన్ని కిలోమీటర్ల లోతులో ఉంది..? రిక్టర్ స్కేలుపై నమోదైన తీవ్రత ఎంత? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్లో మరోసారి భూకంపం కలకలం సృష్టించింది. పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గాఢనిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడం, ఇంట్లోని వస్తువులు కదలడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ రిపోర్ట్ ప్రకారం.. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. పల్నాడు జిల్లాలోని వినుకొండకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూమికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఈ కదలికలు సంభవించాయి. దీని ప్రభావం వినుకొండతో పాటు ప్రకాశం జిల్లాలోని దర్శి, చుట్టుపక్కల గ్రామాల్లో స్పష్టంగా కనిపించింది.
నిపుణుల హెచ్చరిక – భవిష్యత్తులో ముప్పు ఉందా?
ప్రస్తుతానికి ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. అయితే నిపుణుల హెచ్చరికలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రేవత్తలు సూచిస్తున్నారు. ఒకప్పుడు జపాన్ వంటి దేశాల్లోనో లేదా హిమాలయ ప్రాంతాల్లోనో భూకంపాలు వస్తాయని వినేవాళ్ళం. కానీ గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా భూ ప్రకంపనలు రావడం చర్చనీయాంశంగా మారింది.
కొన్ని నెలల క్రితం తెలంగాణలోని పలు జిల్లాల్లో భూమి కంపించిన సంగతి తెలిసిందే. భూ అంతర్భాగంలో ప్లేట్ల కదలికలు లేదా స్థానిక భౌగోళిక మార్పుల వల్ల దక్షిణ భారతదేశంలోని ప్రాంతాల్లోనూ ఈ తరహా ప్రకంపనలు పెరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
