Andhra Pradesh: ఎంత పనిచేశావ్ తల్లి.. కొడుకును చంపి.. ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఇదేనా..

అల్లారుముద్దుగా పెంచిన కొడుకును చంపింది. ఆ తర్వాత తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. అనంతపురంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన కలచివేస్తుంది. మహిళ తల్లిదండ్రులు భర్త గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. ఈ ఘటనలో అసలు ఏం జరిగింది..? మహిళ ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది అనేది తెలుసుకుందాం..

Andhra Pradesh: ఎంత పనిచేశావ్ తల్లి.. కొడుకును చంపి.. ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఇదేనా..
Deputy Tehsildar Wife Suicide

Edited By:

Updated on: Nov 28, 2025 | 10:39 AM

కుటుంబ కలహాలు ఎంతటి ఘోరానికి దారి తీస్తాయనడానికి అనంతపురం నగరంలో జరిగిన ఈ విషాదమే నిదర్శనం. భార్యాభర్తల మధ్య చెలరేగిన గొడవల వల్ల  మూడేళ్ల అభం శుభం తెలియని బిడ్డ ప్రాణాలు కోల్పోగా, కన్నతల్లి కూడా బలవన్మరణానికి పాల్పడింది. రామగిరి డిప్యూటీ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న రవి.. భార్య అమూల్య, కొడుకు హర్షతో కలిసి శారదా నగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసిస్తున్నారు. గత రెండు రోజులుగా భార్యాభర్తలు రవి, అమూల్య మధ్య తీవ్రంగా గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ కలహాలే ఈ విషాదానికి కారణమని భావిస్తున్నారు. గురువారం సాయంత్రం రవి విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. ఎంత పిలిచినా భార్య అమూల్య తలుపులు తీయలేదు. ఆమె ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన రవి, అపార్ట్‌మెంట్ వాసులకు, పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మెయిన్ డోర్‌ను.. ఆ తర్వాత బెడ్‌రూమ్ డోర్‌ను పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా దారుణం జరిగింది. భార్య అమూల్య చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించగా, ఆమె పక్కనే మూడేళ్ల కుమారుడు సహర్ష రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఈ సంఘటనపై పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. ముందు రోజు రాత్రి భర్త రవి, భార్య అమూల్యపై చేయి చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఉదయం రవి డ్యూటీకి వెళ్లిన తర్వాత.. ఇంట్లో ఒంటరిగా ఉన్న అమూల్య తలుపులు గడియ పెట్టుకుంది. కోపంతో క్షణికావేశంలో మొదట కత్తితో కుమారుడు సహర్ష గొంతు కోసి హత్య చేసింది. ఆ తర్వాత అదే గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

మృతురాలు అమూల్య బంధువులు, ముఖ్యంగా ఆమె తండ్రి.. భర్త రవిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. రవి తమ కూతురిని అదనపు కట్నం కోసం వేధించాడని, అలాగే అమూల్యపై చేయి చేసుకునేవాడని వాపోయారు. రవి వేధింపులు భరించలేకే తమ కూతురు ఈ దారుణ నిర్ణయం తీసుకుందని అమూల్య తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకును క్షణికావేశంలో కత్తితో చంపి, తల్లి కూడా ఆత్మహత్య చేసుకోవడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ కలహాలు ఒక చిన్నారి ప్రాణాన్ని బలిగొనడం సమాజాన్ని కలచివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us