AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్శిల్‌లో డెడ్‌బాడీ కేసు: అసలు హంతకుడు అతడే! వదిన ఆస్తి కోసం మరిది దారుణం

పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపిన చెక్క పెట్టెలో డెడ్ బాడీ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. వదిన ఆస్తిపై కన్నేసిన మరిది.. డెడ్ బాడీ సాయంతో బ్లాక్ మెయిల్ చేద్దామని అనుకున్నాడు. కానీ కథ అడ్డం తిరగడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ వ్యవహారానికి ఎలాంటి సంబంధంలేని ఓ కూలి ఇతగాడి పన్నాగానికి బలై శవమయ్యాడు..

పార్శిల్‌లో డెడ్‌బాడీ కేసు: అసలు హంతకుడు అతడే! వదిన ఆస్తి కోసం మరిది దారుణం
Dead Body Home Delivery Case
Srilakshmi C
|

Updated on: Dec 24, 2024 | 12:24 PM

Share

భీమవరం, డిసెంబర్‌ 24: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెక్కపెట్టెలో గుర్తు తెలియని మృతదేహం పార్శిల్‌ వచ్చిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మృతదేహం కాళ్ల గ్రామానికి చెందిన బర్రె పర్లయ్యది (45) గా పోలీసులు అనుమానిస్తున్నారు. డీఎన్‌ఏ టెస్ట్ అనంతరం ఈ విషయాన్ని నిర్ధారించనున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీధర్‌వర్మ వ్యవహారంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి..

తిరుమాని శ్రీధర్‌వర్మకు.. మృతుడిగా అనుమానిస్తున్న పర్లయ్యకు మధ్య ఎలాంటి సంబంధాలు లేవని, కూలీగా జీవనం సాగించే వ్యక్తిని రెండ్రోజులు పని చేయాలని పిలిపించి, పర్లయ్య పీకకు నైలాన్‌ బిగించి కిరాతకంగా హత్య ఎందుకు చేశాడనే ప్రశ్న తొలుస్తుంది. గత గురువారం సాయంత్రం చెక్క పెట్టెలో శవాన్ని బట్వాడా చేసిన సంఘటనలో శ్రీధర్‌ వర్మ నివాసముంటున్న ఇంటి వద్దే బర్రె పర్లయ్య(45) అదృశ్యమయ్యాడనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఎవరీ పర్లయ్య?

బర్రె పర్లయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. వారి మధ్య విభేదాలు రావడంతో గత కొంతకాలంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. కనీసం మాటలు కూడా లేవని స్థానికులు చెబుతున్నారు. పర్లయ్య గతంలో లారీ డ్రైవర్‌గా పని చేసేవాడు. కుటుంబ సమస్యలతో మానసికంగా కుంగిపోయిన పర్లయ్య.. మద్యం అలవాటుపడ్డాడు. దీంతో గాంధీనగరంలోనే రోజంతా కష్టపడి వచ్చినదానితో కడుపు నింపుకుని, పనికి పిలిచినా వారి ఇంటి వద్దే ఆ రాత్రి గడిపేవాడు. మిగతా రోజుల్లో ఇతనికి సొంతిల్లు లేకపోవడంతో పర్లమ్మ ఆలయం వద్దే నిద్రించేవాడు. ఈ క్రమంలోనే ఒంటరిగా ఉంటున్న పర్లయ్యపై శ్రీధర్‌వర్మ కన్నుపడింది. పని నిమిత్తం ఇంటికి పిలిచి హతమార్చాడు.

ఇవి కూడా చదవండి

వదిన ఆస్తి కోసం.. మరిది పన్నాగం

రంగరాజు పెద్ద కుమార్తె తులసి భర్త అదృశ్యమయ్యాడు. పదేళ్ల నుంచి తల్లిదండ్రుల వద్దే ఆమె ఉంటోంది. చిన్న కుమార్తె రేవతి, శ్రీధర్‌ వర్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. యండగండిలో అత్తమామల ఆస్తిపై శ్రీధర్‌ వర్మ కన్నేశాడు. భార్య, అత్త మామలతో చనువు పెంచుకొని ఒంటరిగా ఉన్న తులసి వాటా కింద వచ్చే ఆస్తిని కూడా కాజేయాలని అనుకున్నాడు. ఈక్రమంలోనే కుటుంబంలో గొడవలు రేపడంతో తులసి పాలకోడేరు మండలం గరగపర్రులో అద్దింట్లో ఉంటోంది. కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న తులసీకి స్వచ్ఛంద సంస్థ పేరిట నిర్మాణ సామగ్రిని పంపించాడు. ఓ మహిళ సాయంతో తులసితో మాట్లాడించేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో చెక్క పెట్టెలో గుర్తు తెలియని శవాన్ని ఆమె ఇంటికి పార్శిల్‌ పంపాడు. ఆ పార్శిల్‌ రూ.1.30 కోట్లు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ లేఖ కూడా పెట్టాడు. ఆ లేఖ చూసి తులసి భయపడి తాను చెప్పినట్లు చేస్తుందని ఊహించుకున్నాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది.

అడ్డం తిరిగిన అసలు కథ..

పర్లయ్య శవాన్ని పార్శిల్‌లో తులసి ఇంటికి పంపి, అదే రోజు ఆస్తిపత్రాలపై సంతకాలు సేకరించుకునే ప్రయత్నాల మధ్య ఆమెతో ఘర్షణ నెలకొంది. చాకచక్యంగా బాత్రూంకని వెళ్లిన తులసి ఫోన్‌ ద్వారా విషయాన్ని బంధువులకు, పోలీసులకు చేరవేయడంతో అక్కడికి పోలీసులొచ్చారు. గమనించి శ్రీధర్‌వర్మ అక్కడి నుంచి జారుకున్నాడు. శ్రీధర్‌వర్మ వినియోగించిన ఎరుపు రంగు కారు, మృతుడి ఫొటోలను పోలీసులు సోమవారం విడుదల చేశారు. ఈ ఫొటోలను చూసిన గాంధీనగరం వాసులు ఐదు రోజులుగా పర్లయ్య కన్పించడంలేదని గుర్తించి.. పోలీసులకు తెలిపారు. పర్లయ్య భార్య, పిల్లలు, సోదరులు, బంధువులు కూడా పోలీసుల విచారణకు హాజరయ్యారు. పరారైన శ్రీధర్‌వర్మను మచిలీపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహం పార్శిల్‌లో పంపిన మహిళ జాడ మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us