Andhra: ఆయన హిందూ.. ఆశ్రమం నడిపేది క్రిస్టియన్స్.. అంత్యక్రియలు చేసింది ముస్లింలు
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి సిద్ధన్న వృద్ధాప్యంలో ప్రశాంతి వృద్ధాశ్రమంలో నివసిస్తూ ఉండగా అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి మరణించిన విషయం తెలియజేసి మృతదేహాన్ని తీసుకెళ్లాలని వృద్ధాశ్రమ నిర్వాహకులు ఫోన్ చేసినా, ఇద్దరు కుమార్తెలు రావడం సాధ్యం కాదని చెప్పినట్లు సమాచారం.

తల్లి నవమాసాలు మోసి బిడ్డలకు జన్మనిస్తే… తండ్రి జీవితాంతం కష్టపడి వారిని పెంచి పెద్ద చేస్తాడు. అలాంటి తండ్రి వృద్ధాప్యంలో బిడ్డలా మారి తన పిల్లలపై ఆధారపడాల్సి వస్తుంది. కానీ కొన్నిసార్లు ఆ పిల్లలే తల్లిదండ్రులను మరిచిపోతున్నారు. అలాంటి హృదయ విదారక ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి సిద్ధన్న వృద్ధాప్యంలో హిందూపురం సమీపంలోని ప్రశాంతి వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతూ జీవిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నప్పటికీ, వృద్ధాశ్రమంలోనే రోజులు గడుపుతున్నాడు. ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సిద్ధన్న అక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని వృద్ధాశ్రమ నిర్వాహకులు ఆయన కుమార్తెలకు ఫోన్ ద్వారా తెలియజేసి, వచ్చి తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ ఇద్దరు కుమార్తెలు తాము రావడం సాధ్యం కాదని, వృద్ధాశ్రమ నిర్వాహకులే అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పినట్లు తెలుస్తోంది.
ఎంత ప్రయత్నించినా కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో, వృద్ధాశ్రమ నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు కలిసి సిద్ధన్నకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మృతదేహం, అంత్యక్రియల ఫోటోలను కూడా ఆయన కుమార్తెలకు పంపినట్లు వృద్ధాశ్రమ నిర్వాహకులు తెలిపారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పిల్లలు చూసుకోవడం, ఆఖరికి వారు చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించడం సహజం. కానీ ఈ ఘటనలో కుమార్తెలు కూడా రాకపోవడం వృద్ధాశ్రమంలోని వారిని తీవ్రంగా కలిచివేసింది. ఈ సంఘటన అక్కడ ఉన్న వారందరినీ కంటతడి పెట్టించింది.
