Cyclone Gulab: తీరం దాటింది. పంజా విసురుతోంది.. ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా, గుంటూరు వరకు వర్ష బీభత్సం
తుఫాన్ తీరం దాటి బలహీనపడుతున్నా.. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుండడంతో వరద ముంపుపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.
తీరం దాటింది. పంజా విసురుతోంది. ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా, గుంటూరు వరకు బీభత్సం సృష్టిస్తోంది. గులాబ్ తుఫాన్ జనం గుండెల్లో దడ పుట్టిస్తోంది. తుఫాన్ తీరం దాటి బలహీనపడుతున్నా.. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుండడంతో వరద ముంపుపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం జిల్లాలు అతి భారీ వర్షాలకు అతలాకులతం అవుతున్నాయి. ఇటు తెలంగాణలో నల్గొండ, ఖమ్మం హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో సైతం భారీ వర్షాలు పడుతున్నాయి.
తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన గులాబ్ తుపాను.. రాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటింది. తీరం దాటిన తర్వాత బలహీనపడి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా తీవ్ర వాయుగుండం కేంద్రీకృతం అయింది. మరో 6 గంటల్లో మరింత బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. అటు శ్రీకాకులం, విజయనగరం జిల్లాలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.
ఉత్తర కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు.. మరికొన్ని చోట్ల కుంభవృష్టి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. గులాబ్ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.
విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ముంపు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. సాలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వరద నీరు చేరింది. ఓ పురిటి నొప్పులతో బాద పడుతున్న గర్బిణీని తీవ్ర ఇబ్బందుల మధ్యనే ఆస్పత్రిలో చేర్చారు. వరద నీటిలోనే పలువురు స్థానికులు చేతులపై ఎత్తుకెళ్లారు. అటు సాలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉన్న రోగులంతా తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాత్రి నుంచి కరెంట్, నీళ్లు లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోగులు, వారి బంధువులు. వాష్ రూముల్లో నీళ్లు లేక.. బయటకి వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. చిమ్మని చీకట్లోనే బాలింతలు, గర్భిణీలు ఉన్నారు.
Also Read: అనంతపురం జిల్లాలో బంగారం నిక్షేపాలు.. టన్ను మట్టి తవ్వితీస్తే 4 గ్రాముల గోల్డ్