Chandrababu: అన్నం తినడం పూర్తిగా మానేసిన ఏపీ సీఎం.. ఎక్కువగా ప్రొటీన్..
అన్నం తగ్గించి… ప్రోటీన్ పెంచితేనే ఆరోగ్యం బాగుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారు. రోజూ చేపలు, కంట్రోల్డ్ డైట్, హెల్త్ ట్రాకింగ్ టెక్నాలజీతో ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న ఆయన మాటలు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. పూర్తి వివరాలు కథనంలో ...

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇటీవలి కాలంలో తన ఆహారపు అలవాట్ల గురించి తరచూ ప్రజలతో పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నం మానేశాను, ప్రోటీన్ మాత్రమే తింటున్నాను… అనే మాట ఆయన పలుమార్లు చెబుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ‘మత్స్యకార సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, చేపల ప్రాధాన్యతపై మాట్లాడారు. ప్రోటీన్ తింటే ఆరోగ్యం బాగుంటుంది.. డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది అంటూ తన డైట్ గురించి కూడా ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఆహారం, ఫిట్నెస్ రొటీన్ పై చర్చ మొదలైంది.
చంద్రబాబు డైట్లో ముఖ్యంగా ప్రోటీన్కు ప్రాధాన్యత ఉంటుంది. రోజూ ఆహారంలో ఒక చేప ముక్క తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటున్నట్లు ఆయన చెబుతున్నారు. కార్బోహైడ్రేట్స్ను తగ్గించి, ముఖ్యంగా వైట్ రైస్ వినియోగాన్ని తగ్గించడం ఆయన తీసుకున్న పెద్ద నిర్ణయం. ఆయిల్, సాల్ట్ కూడా కంట్రోల్లో ఉంచాలని తరచూ సూచిస్తున్నారు.
ఫిట్గా ఉండటానికి, ఎనర్జీ మెంటైన్ చేయడానికి ప్రోటీన్ కీలకం అన్నది ఆయన స్టాండ్. ఇక ఆయన హెల్త్ మానిటరింగ్ కూడా టెక్నాలజీ ఆధారంగా జరుగుతోంది. హెల్త్ ట్రాకింగ్ రింగ్ ద్వారా నిద్ర, ప్రోటీన్ లెవల్స్, ఫిజికల్ యాక్టివిటీ అన్నీ ట్రాక్ చేస్తుంటారు. నిద్ర తక్కువైతే అలర్ట్ ఇస్తుంది… ప్రోటీన్ తక్కువైతే వెంటనే ఆహారంలో పెంచుకుంటాను అని ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే, ఆయన డైట్ అనేది రెగ్యులర్ కాదు… పూర్తి లెక్కలతో నడిచే వ్యవస్థ.
మొత్తానికి, చంద్రబాబు ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో ఒక కొత్త మెసేజ్ ఇస్తున్నారు. అన్నం తగ్గించి, ప్రోటీన్ పెంచే జీవనశైలి వైపు మళ్లాలని సూచిస్తున్నారు. ఆరోగ్యం, ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టే నాయకుడిగా తన ఇమేజ్ను మరింత బలపరుస్తున్నారు. ఇక ఆయన ఈ ప్రోటీన్ ఫార్ములా ఎంతవరకు ప్రజల్లో ఫాలో అవుతుందన్నది చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
