
కుప్పం మండలం రాళ్లబుదుగూరుకు చెందిన ఆర్.నాగమణి దేవుడి చిన్నచూపుతో అంధురాలిగా జన్మించింది. అయినప్పటికీ ఆత్మస్థైర్యం, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంఏ వరకూ చదువుకుంది. ఆమె అంధురాలు కావడం, కుటుంబం ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉండటంతో వివాహమవ్వడం భారంగా మారింది. అయితే ఆ కుటుంబ ధీన పరిస్థితిని అర్థం చేసుకుని శాంతిపురం మండలం, వెంకటాపురం గ్రామానికి చెందిన భూపతి అనే యువకుడు నాగమణిని మనువాడేందుకు ముందుకొచ్చాడు. ఇటీవల నాగమణి ముఖ్యమంత్రిని భూపతితో కలిసి వచ్చి తన వివాహానికి ఆర్థిక సాయం చేయాలని కోరింది. స్పందించిన సీఎం చంద్రబాబు వివాహ ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షలు ప్రకటించారు. బుధవారం సీఎం చంద్రబాబును కలిసి చెక్కు అందుకున్నారు. నాగమణిని వివాహం చేసుకుని తోడ్పాటుగా ఉండేందుకు ముందుకువచ్చిన భూపతిని సీఎం చంద్రబాబు అభినందించారు. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. భయపడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటానని యువతికి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. చంద్రబాబు ఆప్యాయతతో పలకరించడంతో అంధ యువతి ఎంతో సంతోషం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బిజి బిజీగా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు. అదే సమయంలో కుప్పం వాసులకు ఏ కష్టమొచ్చినా అండగా నిలుస్తున్నారు. కుప్పంలో అందుబాటులో లేకపోయినా అక్కడి ప్రజలు నేరుగా తనకు సమస్యలు విన్నవించుకునే ఏర్పాట్లు చేశారు. గ్రామాలకు చెందిదన సమస్య అయినా.. వ్యక్తిగత సమస్య అయినా చంద్రబాబుకు చెప్పుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ వ్యవహారాలన్నీ కుప్పం నియోజకవర్గ ఇంచార్జ్ గా ఎమ్మెల్సీ శ్రీకాంత్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆయన ద్వారా ప్రజలకు చంద్రబాబు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..