Chandrababu Naidu: పవన్ కల్యాణ్ పై దాడి చేసి చంపేస్తారా.. తప్పుడు పనుల కోసమే సీఎం పదవి.. చంద్రబాబు ఫైర్..
వైసీపీ తీరుపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కబ్జాల గురించి ప్రశ్నించిన అయ్యన్నను అరెస్టు చేశారన్న..

వైసీపీ తీరుపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కబ్జాల గురించి ప్రశ్నించిన అయ్యన్నను అరెస్టు చేశారన్న చంద్రబాబు.. అయ్యన్నపాత్రుడిని అక్రమంగా అరెస్టు చేశారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైసీపీ అరాచక పాలనకు పరాకాష్ఠగా మారిందని ఆక్షేపించారు. పవన్ కల్యాణ్ మీద దాడులు చేస్తారా. చంపేస్తారా తెల్లవారు జామున 3 గంటలకు వెళ్లి అయ్యన్నను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. పోలీసులు తాగి గోడలు దూకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. కొంతమంది అధికారులు తప్పుడు విధానాలతో ముందుకు వెళ్తున్నారన్న చంద్రబాబు.. అలాంటి వారిని వదిలి పెట్టేదే లేదని స్పష్టం చేశారు. బాబాయిని హత్య చేయించినట్లుగా అయ్యన్నపాత్రుడు ఏమీ చేయలేదే ? ధైర్యం ఉంటే జగన్ బాబాయిని హత్యచేసిన వారిని అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. వివేకా హత్య కేసులో సీఐ శంకరయ్య సీబీఐకి తొలుత వాంగ్మూలం ఇచ్చారని, ప్రభుత్వం నుంచి పదోన్నతి పొందాక ఆ వాంగ్మూలం వెనక్కి తీసుకున్నారని చంద్రబాబు చెప్పారు. తప్పుడు పనులు చేయడంలో జగన్కు అవార్డు ఇవ్వాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఇంటి వద్ద అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై అటు సోమువీర్రాజు, ఇటు చంద్రబాబు కూడా రెస్పాండ్ అయ్యారు. మరోవైపు ఏపీలో కాపు సర్కిళ్లల్లో పవన్ కల్యాణ్ ను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చారంటూ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు..
భూ దోపిడీ కుటుంబం నుంచి వచ్చిన చరిత్ర జగన్ది. ఇడుపులపాయలో వందల ఎకరాలు ఆక్రమించుకున్నారు. బంజారాహిల్స్లో ప్రభుత్వ స్థలాన్ని కాజేసి సీఎం అయ్యాక రిజిస్టర్ చేయించుకున్నారు. ఇంతటి భూ దోపిడీ కుటుంబ నేపథ్యం నుంచి జగన్ వచ్చారు. 0.02 సెంట్ల భూమి ఆక్రమణ ఆరోపణలపై అయ్యన్నను అరెస్టు చేయించడం దుర్మార్గం. వైఎస్ కుటుంబం అక్రమాలపై ఫిర్యాదు చేస్తాం.. చర్యలు తీసుకుంటారా?. హత్య చేసిన అవినాష్కు అభయం ఇస్తున్నారు. ఉత్తరాంధ్ర కబ్జాలను ప్రశ్నించిన అయ్యన్నను అరెస్టు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారి గొంతు నొక్కుతారా?. తప్పుడు పనులు చేయడానికే సీఎం పదవిలో జగన్ ఉన్నారు.
– చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి




కాగా.. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిని సీఐడీ పోలీసులు గురువారం తెల్లవారు జామున అరెస్టు చేశారు. నర్సీపట్నంలో అయ్యన్న నివాసానికి వెళ్లిన పోలీసులు నోటీసులిచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఇంటిగోడ కూల్చివేత విషయంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న అభియోగాలపై అయ్యన్నపాత్రుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతని కుమారుడు చింతకాయల రాజేశ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అయ్యన్నపాత్రుడి అరెస్టుపై ఆయన సతీమణి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అర్ధరాత్రి దౌర్జన్యంగా అరెస్టు చేయడమేంటని నిలదీశారు. కనీసం దుస్తులు మార్చుకొనివ్వకుండా తన భర్తను తోసుకుంటూ తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి