
తన ప్రాణాలకు ప్రాణహాని ఉందన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ఈ రాష్ట్రంలో పవన్ కల్యాణ్కే కాదు ఎవ్వరికీ రక్షణలేకుండా పోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో పర్యటించిన పురందేశ్వరి దిశ యాప్ తో పోలీసులు ఎవ్వరినీ రక్షించలేకపోయారని మండిపడ్డారు. ఏపీలో సాక్ష్యాత్తూ ఎంపీ కుటుంబానికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి రక్షణ పరిస్థితేంటని విశాఖ ఎంపీ కిడ్నాప్ వ్యవహారాన్ని లేవనెత్తారు. కాగా ఇటీవల తూర్పుగోదావారి జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ.. తనను చంపేందుకు సుపారీ గ్యాంగులు రంగంలోకి దిగాయంటూ జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.
మరోవైపు పవన్ కల్యాణ్ ప్రాణహాని వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్కు ప్రాణహాని ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని హితవు పలుకుతున్నారు. ఇక ఏపీలో పవన్ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓవైపు పవన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంటే దీనికి ప్రతిస్పందనగా వైసీపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలోనే కౌంటర్లు ఇస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..