ఎన్నికల ఫలితాలపై కోనసీమలో పంచాంగ కర్తల విశ్లేషణలు ఆసక్తి రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కంటే తాము ముందే చెబుతున్నామని.. తమకు ప్రిడిక్షన్ విషయంలో చాలా క్రెడిబులిటీ ఉందని చాలామంది చెబుతున్నారు. ఏపీకి ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తేల్చి చెప్పేస్తున్నారు కోనసీమకు చెందిన పంచాగ కర్తలు. నాయకుల జాతకాల ఆధారంగా.. లెక్కలు వేసి.. ఏపీలో గెలుపుఓటములపై వీరు లెక్కలు చెబుతున్నారు. అంతే కాదండోయ్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు. ముఖమ్యమంత్రిగా ఏ రోజు ప్రమాణ స్వీకారం చేస్తే మంచిదో కూడా ఉచిత సలహాలు ఇస్తున్నారు. వైసీపీ 106 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం అటున్నారు తాడేపల్లిగూడెంకి చెందిన ప్రముఖ సిద్ధాంతకర్త పల్లవార్దుల శ్రీరామకృష్ణ శర్మ. టీడీపీకి 69 స్థానాలే వస్తాయన్నది ఆయన ప్రిడిక్షన్. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అందరూ బీఆర్ఎస్ వస్తుందని చెబితే.. తాను మాత్రం కాంగ్రెస్ వస్తుందని ముందే చెప్పినట్లు ఆయన గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏపీలో తాను చెప్పిందే నిజం అవుతుంది అంటున్నారు.
టీడీపీ, జనసేన, బిజేపీ కూటమికి 135 సీట్లు వస్తాయని చెబుతున్నారు అమలాపురంకి చెందిన మరో ప్రముఖ పంచాంగ కర్త ఉపదృష్ట నాగాదిత్య. అంతేకాదు జ్యోతిష శాస్త్ర ప్రకారం.. ఈ పార్టీల అధినాయకుల జాతకాలకు ఈనెల 9, 11తేదీలు ప్రమాణ స్వీకారానికి మంచి రోజు అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్లో పస ఉండదని.. తమ ప్రిడిక్షనే కరెక్ట్ అవుతుందని ఎవరికి వారు చెప్పేస్తున్నారు. రాజకీయ నాయకులు, పార్టీ అధినేతల గ్రహ స్థితులను బట్టి అధికార యోగం ఉంటుందన్నది వారి వెర్షన్. మరి ఎవరి భవిష్యవాణి నిజం అవుతుంది… ఎవరు అధికార పగ్గాలు చేపడతారన్నది తేలాలంటే జూన 4 వరకు ఆగాల్సిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..