
ఏపీలోని అమరావతి ప్రాంతంలోని R-5 జోన్లో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వొచ్చంటూ ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో జగన్ సర్కార్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హౌసింగ్పై గురువారం సమీక్ష నిర్వహించారు. ఇళ్లు లేని ప్రతి పేదవాడికి సెంటు భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఈ నెల 26న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒకేసారి 50 వేల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చే విధంగా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే జగన్ పలు సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. 50 వేలకుపైగా లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చేందుకు 1460 ఎకరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
మరోవైపు పేద ప్రజలు సెంటు భూమిలో ఎలా ఇళ్లు కట్టుకుంటారని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తమ హయాంలో పేదలకు కనీసం 3 సెంట్ల భూమి ఇచ్చామంటూ చంద్రబాబు జగన్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సెంటు భూమి వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేశారు ఏపీ మంత్రి జోగి రమేశ్. టీడీపీ హయాంలో ఆ సెంటు స్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఆ సెంటు స్థలంలోనే పేద ప్రజలు టీడీపీని పూడ్చటానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
మొత్తం 51 వేల 392 మంది లబ్దిదారులకు అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. ఐనవోలు, మందడం, కృష్ణాయ పాలెం, నవులూరు, కురగల్లు, నిడమర్రు, బోరుపాలెం, పిచ్చుకలపాలెం, అనంతవరంలో పట్టాల పంపిణీ జరగనుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..