Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ప్రాణాలు తీసిన ఫొటోల సరదా.. చెరువులో పడి ఇద్దరు విద్యార్ధులు దుర్మరణం

ఫొటోలు తీసుకోవడానికి చెరువు వద్దకు వెళ్లిన ఇద్దరు విద్యార్ధులు దుర్మరణం చెందారు. ప్రమాదవశాత్తు గుంతలో పడి ఈ ఇద్దరు మృత్యువాత పడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావరగూడెంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని పటమటకు చెందిన ఎన్‌ శశివర్ధన్‌ (15), జి అంకిత్‌(14)లు ఒకే పాఠశాలలో చదవుతున్నారు. శశివర్ధన్‌ పదో తరగతి చదువుతుండగా.. అంకిత్‌ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరు స్నేహితులు కావడంతో ఫొటోలు..

AP News: ప్రాణాలు తీసిన ఫొటోల సరదా.. చెరువులో పడి ఇద్దరు విద్యార్ధులు దుర్మరణం
Two Students Fell Into Pond
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 20, 2023 | 7:00 AM

గన్నవరం, నవంబర్‌ 20: ఫొటోలు తీసుకోవడానికి చెరువు వద్దకు వెళ్లిన ఇద్దరు విద్యార్ధులు దుర్మరణం చెందారు. ప్రమాదవశాత్తు గుంతలో పడి ఈ ఇద్దరు మృత్యువాత పడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావరగూడెంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని పటమటకు చెందిన ఎన్‌ శశివర్ధన్‌ (15), జి అంకిత్‌(14)లు ఒకే పాఠశాలలో చదవుతున్నారు. శశివర్ధన్‌ పదో తరగతి చదువుతుండగా.. అంకిత్‌ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరు స్నేహితులు కావడంతో ఫొటోలు తీసుకోవడానికి ఇద్దరూ గన్నవరం మండలం సావరగూడెం పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్న బాపట చెరువు వద్దకు ఆదివారం (నవంబర్‌ 19) మధ్యాహ్నం వెళ్లారు.

అక్కడ తమ స్నేహితులు కూడా రావల్సిందిగా ఫోనులో తెలిపారు. వాళ్లు వచ్చేలోగా అక్కడ ఫొటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు ఇద్దరూ చెరువు గుంతలో పడిపోయారు. ఇంతలో అదే సమయానికి ఘటనా స్థలానికి చేరుకున్న స్నేహితులు నీళ్లలో మునిగిపోతున్న తమ మిత్రులను చూసి వారంతా కేకలు వేశారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. తమ కుమారులు చెరువులో పడి మృతి చెందడం ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. బిడ్డలను పట్టుకుని వారి తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

ఇంట్లో గ్యాస్‌ లీకై.. భారీ పేలుడు! ఐదుగురికి తీవ్ర గాయాలు

విజయనగరంలోని ఓ ఇంట్లో గ్యాస్‌ లీకై భారీ పేలుడు సంభవించించింది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండల కేంద్రంలో ఆదివారం (నవంబర్ 19) ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అయిదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారు నివసిస్తోన్న ఇల్లు కూడా ధ్వంసమైంది. అసలేం జరిగిందంటే.. గవరవీధిలో నివాసం ఉంటోన్న కెల్ల శ్రావణి నాగుల చవితి పండగకు అదే ప్రాంతంలోని పుట్టింటికి వెళ్లింది. తిరిగి శనివారం రాత్రి ఇంటికి వచ్చింది. వచ్చేటప్పుడు గ్యాస్‌ సిలెండరు తనతోపాటు తెచ్చుకుంది. అది ఇంట్లో రాత్రంతా లీకయింది. ఈ విషయం గమనించని శ్రావణి తల్లి వెంకటలక్ష్మి ఆదివారం తెల్లవారుజామున నిద్ర లేచి లైటు వేసింది. వెంటనే పెద్దశబ్దంతో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇల్లు తీవ్రంగా దెబ్బతింది. వెంకటలక్ష్మితో పాటు శ్రావణి, ఆమె పదేళ్ల కుమారుడు మోహన్‌, ఎనిమిదేళ్ల కూతురు లాస్య, ఏడేళ్ల మేనకోడలు ప్రణవి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.