Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పథకం.. వారందరి అకౌంట్లోకి నేరుగా రూ.25 వేలు.. డేట్ ఫిక్స్..
ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఆగస్ట్ 7వ తేదీన నేతన్నల సేవలో పథకాన్ని ప్రారంభించనుంది. ఈ స్కీమ్ ద్వారా రూ.25 వేలు అందించనుంది. ప్రతీ ఏడాది ఈ నగదు అందిస్తారు. అర్హులను ఇప్పటికే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్తగా అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వీటి ద్వారా లక్షలాది మంది లబ్ది పొందుతున్నారు. అయితే త్వరలో మరో కొత్త పథకం అమలుకు చంద్రబాబు సర్కార్ సిద్దమైంది. ఇందుకు సంబంధించి తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. చేనేతల కోసం నేతన్నల సేవలో పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. ఈ పథకం విధివిధానాలను వెల్లడిస్తూ జీవో విడుదల చేసింది. అలాగే ఎంత ఆర్ధిక సాయం అందిస్తామనేది కూడా ప్రకటించింది. రాష్ట్రంలోని చేనేతలకు ఈ ప్రకటన పెద్ద పండుగగా చెప్పవచ్చు.
ఆగస్ట్ 7న పథకం ప్రారంభం
ఆగస్ట్ 7వ తేదీన నేతన్నల సేవలో పథకాన్ని ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనుంది. ఈ స్కీమ్ ద్వారా చేనేతలకు ఏడాదికి రూ.25 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించనుంది. వీటిని నేరుగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుంది. అర్హత కలిగిన ప్రతీ చేనేత కుటుంబానికి దీని ద్వారా లబ్ది చేకూర్చనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మగ్గాల సంఖ్య, చేనేత కార్మికుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతీ కుటుంబానికి సాయం అందిస్తారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 51,952 కుటుంబాలు ఈ పథకానికి అర్హులుగా తేలారు. దీంతో వీరి అకౌంట్లలో త్వరలో జమ చేయనున్నారు. త్వరలో అకౌంట్లలో డబ్బులు పడనుండటంతో చేనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా బీపీఎల్ కేటగిరీలో ఉన్న కుటుంబాలకు వీటిని అందించనున్నారు. చేనేత మగ్గం ఉన్న కుటుంబపెద్ద అకౌంట్లలో రూ.25 వేలు జమ చేస్తారు. ఒక కుటుంబానికి ఎన్ని మగ్గాలు ఉన్నప్పటికీ.. ఏడాదికి ఒకేసారే సాయం అందిస్తారు. ప్రస్తుతం చేనేత వృత్తిలో కొనసాగుతూ బీపీఎల్ కుటుంబానికి చెందినవారైతే ఈ నగదు అందుతుంది.
సచివాలయాల్లో అర్హుల జాబితా
ఈ ఏడాదిలో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ పథకం లబ్దిదారులను నేతన్న సేవలో పథకానికి ప్రామాణికంగా తీసుకోనున్నారు. అయితే చేనేత కార్మికులు చేనేతశాఖ డేట్ బేస్లో తమ పేర్లు నమోదు చేసుకుని ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయ అధికారులు అర్హులను ఎంపిక చేస్తారు. అనంతరం కలెక్టర్ల ఆమోదంతో అర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.
