AP Home Minister: బాధితులకు అండ ఉంటాం.. ప్రజలకు హాని కలిగించే పరిశ్రమలను మూసివేస్తాం: హోంమంత్రి వనిత
ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాకర్టీలో ఘటన బాధితులను హోంమంత్రి పరామర్శించారు.
Home Minister Vanitha: ప్రజలకు హానికలిగించే పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహించదని ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత(Thaneti Vanitha) స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాకర్టీ(Porus Chemical Factory)లో ఘటన బాధితులను హోంమంత్రి పరామర్శించారు. అక్కిరెడ్డిగూడెంలో జరిగిన ఘటనపై సీఎం వైఎస్ జగన్ స్పందించి, పరిశ్రమను సీజ్ చేయటానికి ఆదేశాలు ఇచ్చినట్టు ఆమె వెల్లడించారు. విజయవాడ గొల్లపూడిలో ఉన్న ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన హోం మంత్రి.. ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అక్కిరెడ్డి గూడం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి జరిగిన ప్రమాదం.. బాధితుల కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. బతుకు దెరువు కోసం.. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన జీవితాలు.. కూలీ నాలీ చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న బతుకులు.. ఊహించని ప్రమాదానికి ఆహుతయ్యాయి. ఇన్నాళ్లూ కుటుంబానికి భరోసా ఇచ్చిన వాళ్లిప్పుడు.. విగతజీవులుగా మారారు. మరికొంత మంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కొండంత అండను కోల్పోయిన ఆ కుటుంబాలకు తీరని శోకం మిగిలింది. మొత్తం 11 మందిలో నలుగురికి 50శాతం కన్నా తక్కువ గాయాలు కాగా, మరో ఆరుగురికి 50శాతం కన్నా ఎక్కువ గాయాలైనట్టు హోంమంత్రి వనిత పేర్కొన్నారు. ఒకరికి 90శాతంపైగా శరీరం కాలిపోయినట్టు వెల్లడించారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి రూ.25లక్షలు, పరిశ్రమ నుంచి రూ.25లక్షలు సాయం అందిస్తున్నట్టు వివరించారు. గాయపడిన వారికి రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్టు హోంమంత్రి తెలిపారు. పరిశ్రమ నుంచి లీకేజీల వల్ల అక్కడి ప్రజలకు సమస్య ఉన్నట్టు గ్రామస్థులు తెలిపారని మంత్రి పేర్కొన్నారు.
మరోవైపు, ఒంటి నిండా గాయాలతో.. ఊపిరి అందక గుండె ఎప్పుడు ఆగుతుందో తెలియని పొజిషన్లో వాళ్లంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మామూలుగా 40 నుంచి 50 శాతం కాలితేనే బతకడం కష్టం అలాంటిది 70శాతం గాయాలతో.. ఐసీయూలో అచేతనంగా పడి ఉన్నారని ఆసుపత్రి వైద్య సిబ్బంది తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యమో.. సాంకేతిక లోపమో.. కారణం ఏదైనా కావచ్చు. కార్మికుల జీవితాలు మాత్రం మసైపోయాయి.
Read Also… Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కొండచిలువను నమిలి తినేసిన రాకాసి బల్లి.. కట్ చేస్తే!