Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికీ ప్రతీ నెలా రూ.4 వేలు.. పథకం అమలుకు రెడీ..
ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది కూడా మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. మిషన్ వాత్సల్య పథకం కోసం అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి దరఖాస్తు చేసుకుంటే అర్హులను పరిశీలించి లబ్దిదారులుగా చేరుస్తారు. ప్రతీ నెలా అకౌంట్లో రూ.4 వేలు అందిస్తారు.

ఏపీ పథకం మరో పథకం అమలుకు సిద్దమైంది. అదే మిషన్ వాత్సల్య పథకం. ఈ స్కీమ్ను ఈ ఏడాది కూడా అమలు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అనాథ పిల్లలకు ప్రతీ నెలా రూ.4 వేలు అందించనుంది. ఆర్హులైనవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తులను అధికారులు పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేస్తారు. అనాథ పిల్లలకు 18 ఏళ్లు వచ్చేంత వరకు ప్రతీ నెలా రూ.4 వేల ఆర్ధిక సాయం ప్రభుత్వం అందిస్తుంది. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి వీటిని నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు.
మిషన్ వాత్సల్య పథకం
తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మిషన్ వాత్సల్య పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అనాథ పిల్లల చదువు, పోషణ కోసం ఆర్దిక సహాయం అందిస్తోంది. ప్రతీ ఏడాది లక్షలాది మంది పిల్లలకు ఈ స్కీమ్ ద్వారా అండగా నిలుస్తోంది. ఈ ఏడాది కూడా ఈ పథకం అమలుకు సిద్దమయ్యారు. అర్హులైన అనాథలను గుర్తించి పథకంలో చేర్చాలని అధికారులను ప్రభుత్వం కోరింది. అర్హులైన పిల్లలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గతంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తింపజేశారు. కానీ ఇప్పుడు విడాకులు తీసుకున్న జంటల పిల్లలు, ప్రకృతి వైపరీత్యాలతో తల్లిదండ్రులను కోల్పోయినవారు, యాసిడ్ బాధితులు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు లేనివారు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడే తల్లిదండ్రుల పిల్లలకు కూడా వర్తింపచేయాలని నిర్ణయించారు.
ప్రతీ ఏడాది అకౌంట్లోకి రూ.48 వేలు
ప్రతీ నెలా రూ.4 వేల చొప్పున ఇవ్వనుండగా.. వీటిని ఆరు నెలలకు ఒకసారి రూ.24 వేల చొప్పున అకౌంట్లలో జమ చేస్తారు. ఏడాదికి రూ.48 వేలు అందుతాయి. వీటిని పిల్లల పోషణ, చదువులకు ఉపయోగించుకోవచ్చు. సీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం అధికారుల్ని, అంగన్వాడీ కార్యకర్త, పర్యవేక్షకురాలు, సీడీపీవోను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. అలాగే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్, రేషన్కార్డు కాపీలు, బ్యాంక్ పాస్ బుక్తో పాటుగా అవసరమైన పత్రాలు అందించాలి. అలాగే పత్రాలపై గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే.. 2026 మార్చి 31 నాటికి 18 ఏళ్లలోపు వయసు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ. 72వేలు.. పట్టణాల్లో రూ. 96వేలు మించి ఉండకూడదు.
