ఎన్నికల ముంగిట కుతకుతలాడుతున్న కూటమి.. పలు చోట్ల కుమ్ములాటలు
కూటమి కుతకుతలాడుతోంది. సమన్వయ గండంతో సాగిలపడుతోంది. క్యాడర్ కొట్లాట.. లీడర్ల ఈగో తెగ టెన్షన్ పెడుతోంది. ఎన్నికల ముంగిట రోజుకో గొడవ నేతల్ని కలవరపెడుతోంది. ఆ డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం...
నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలకు పొసగడం లేదు. అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కాయి. చేజర్ల మండలం నాగులవెల్లటూరులో నేతలు కొట్టుకునే దాకా వెళ్లింది పరిస్థితి. టీడీపీలోని రెండు వర్గాల మధ్య వివాదం తోపులాటకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యపై కేశవ చౌదరి వర్గం దాడికి దిగింది. ఈ తోపులాటలో కిందపడిపోయారు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి. నాగులవెల్లటూరులో టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఆనం మొదటగా స్థానిక నాయకుడు వేలూరు కేశవ చౌదరి ఇంటి నుంచి ప్రచారాన్ని మొదలు పెట్టాల్సి ఉంది. దానికి విరుద్ధంగా ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రవీంద్రనాయుడు ఇంటికి ఆనంను కొమ్మి లక్ష్మయ్య తీసుకెళ్లారు. దీనిని తట్టుకోలేని కేశవ చౌదరి వర్గం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మొదటి నుంచి పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వరా అంటూ ఫైరయ్యింది. దీనంతటికీ కారణం కొమ్మి లక్ష్మయ్య నాయుడేనని కన్నెర్రజేసింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జనాలను చెదరగొట్టడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.
ఇక ఏలూరు జిల్లా టీడీపీలోనూ వర్గ పోరు తారస్థాయికి చేరింది. జీలుగుమిల్లి టీడీపీలో వర్గ పోరు వీధికెక్కింది. ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ప్రచారంలో ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలతో పరస్పరం ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఇరు వర్గాల ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తూ.. పాతవాళ్లను పట్టించుకోవట్లేదని ఆరోపించారు తెలుగు తమ్ముళ్లు.
ఎన్నికల టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ వర్గ పోరు ముదరడం కూటమి నేతల్ని ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఓవైపు వైసీపీ దూకుడు ప్రదర్శిస్తుంటే.. నిత్య గొడవలతో కూటమి కుదేలవుతోంది. రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని కూటమి లీడర్లు బెంగ పెట్టుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..