Yaas Cyclone: యాస్ తుపాను ఎఫెక్ట్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
Yaas Cyclone: ‘యాస్’ తుపాను నేపథ్యంలో ప్రభావిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు, అండమాన్ నికోబార్..

Yaas Cyclone: ‘యాస్’ తుపాను నేపథ్యంలో ప్రభావిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్.. యాస్ తుపానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. యాస్ తుపాను కదలికలను పరిశీలిస్తే రాష్ట్రంపై దాని ప్రభావం స్వల్పంగా ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పరిస్థితులను అంచనా వేసుకుని ముందుకు సాగుతామని కేంద్ర హోంమంత్రికి వివరించారు. మే 22న కేంద్ర కేబినెట్ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు అన్ని విభాగాల అధికారులు హాజరయ్యారని, తుపానును ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు.
ఇదిలాఉండగా.. కేంద్ర హోంమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. యాస్ తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అయితే, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని సమావేశంలో ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఆక్సిజన్ సరఫరాపై అధికారులకు ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. తుపాను వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలని స్పష్టం చేశారు. తుపాను పరిణామాలను ఊహించి ఆ మేరకు సిద్ధం కావాలన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్నారు. ఆక్సిజన్ సిలెండర్లకు, రీఫిల్లింగ్ చేసే ప్లాంట్లకూ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. అలాగే ఆస్పత్రులకు కరెంటు సరఫరాలో ఇబ్బందులు లేకుండా డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా విద్యుత్ సిబ్బందిని ఆయా ఆస్పత్రులకు కేటాయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. తుపాను కారణంగా ఒడిశా ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ సేకరణకు ఇబ్బందులు వస్తే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు ఆక్సీజన్ తగినంత నిల్వలు పెట్టుకోవాలని అధికారులకు సూచించారు.
కోవిడ్ రోగులు, ప్రజలు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కోవిడ్ పేషెంట్ల తరలింపు అవసరం అనుకుంటే ఇప్పుడే చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. కోవిడ్ కేర్ సెంటర్లకు కరెంటు సప్లయ్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒకటికి రెండు సార్లు పూర్తిస్తాయిలో ఆలోచనలు చేసి సమర్థవంతగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన సాంకేతిక సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అవసరమైన చోట్ల లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజల తరలింపు వెంటనే ప్రారంభించాలన్నారు. సహాయ శిబిరాల్లో నిత్యావసరాలు మొదలు, అన్ని సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు. కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
కాగా, ఈ సమీక్షా సమావేశంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ ఆదిత్యనాథ్దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తదితరులు హాజరయ్యారు.
Also read:
Vakeelsaab Fight Scene: చెలరేగిన నెల్లూరు కుర్రాళ్లు.. ‘వకీల్సాబ్’ ఫైట్ సీన్ను యాజిటీజ్ దించేశారు
