ప్రభుత్వ స్కూల్లో నో అడ్మిషన్ బోర్డు.. క్లాస్లో విద్యార్థుల సంఖ్య తెలిస్తే అవాకవ్వాల్సిందే!
రాష్ట్ర విద్యా వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు, అద్భుతమైన పథకాలలో ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. కొన్ని స్కూల్లలో ఏకంగా నో అడ్మిషన్ బోర్డుకు కూడా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డుల దర్శనమివ్వడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆ పాఠశాల హెడ్మాస్టర్ ఫయాజుద్దీన్, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు.

రాష్ట్ర విద్యా వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులతో రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్లలో అడ్మిషన్ను పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ పురపాలక ఉన్నత పాఠశాలకు బడి తెరిచిన నాటి నుంచి ప్రతి రోజు సిఫారసు లేఖలతో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను బడిలో చేర్చుకోవాలని క్యూ కడుతున్నారు. ఇప్పటికే 6 నుంచి పదో తరగతి వరకు పాఠశాలలో 1,725 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కో గదిలో 120 మందికి పైగా విద్యార్థులు కూర్చుంటున్నారు. ఈ నేపథ్యంలో స్కూల్లో విద్యార్థులకు చోటు చాలక పోవడంతో స్కూల్ బయటన నో అడ్మిషన్ బోర్డు పెట్టారు.
కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో సమూలమైన మార్పులు చేసి సన్న బియ్యంతో విద్యార్థులకు భోజనం వడ్డించడం తల్లికి వందనం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్న అంతమందికి రూ.15 వేలు జమ చేయడంతో ప్రభుత్వ పాఠశాలలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ పాఠశాలకు ఏటా పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెరుగుతుండడం ఉపాధ్యాయులు, క్రమశిక్షణతో బోధన చేస్తుండడం, NCC , క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో తల్లిదండ్రులు ఆ పాఠశాలలో చేర్చేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు.
450 పైగా అడ్మిషన్లు..
రాష్ట్రంలో అత్యధికంగా విద్యార్థులు చదువుతున్న పురపాలక పాఠశాలల్లో ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాల ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులు చదువుతున్నారు. 2025- 26 విద్యా సంవత్సరానికి 450 పైగా అడ్మిషన్లు చేసుకున్నారు. ఒక్క ఆరో తరగతి లోని 298 పైగా అడ్మిషన్లు అయ్యాయి. ఒక్కో తరగతి గదిలో 120 మందికి పైగా విద్యార్థులు కూర్చుంటున్నారు. తరగతి గదిలో కూర్చోడానికి కూడా స్థలం లేక కొంతమంది నేలపైనే కూర్చొని పాటలు వింటున్నారు.
మంత్రి నారా లోకేష్ అభినందనలు
అయితే నెహ్రూ మెమోరియల్ హైస్కూల్లో నో అడ్మిషన్ల బోర్డులు పెట్టడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించారు. 1725 మంది విద్యార్థులున్న ఈ హైస్కూలులో ఈ ఏడాది అన్ని తరగతుల్లో 400 మందికి పైగా కొత్త విద్యార్థులు చేరడం ప్రభుత్వ విద్య పట్ల ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని ఆయన అన్నారు.`నో అడ్మిషన్ బోర్డు పెట్టి, అడ్మిషన్స్ క్లోజ్ చేశామని తల్లిదండ్రులకు నచ్చజెపుతున్నా, మా పిల్లాడి ఒక్కడిని చేర్చుకోండి సార్` అని బతిమాలుతుంటే కాదనలేకపోతున్నామని చెబుతున్న హెడ్మాస్టర్ ఫయాజుద్దీన్, టీచర్లు, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ మంత్రి ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రతి స్కూలులో ఇలాగే నో అడ్మిషన్ బోర్డులు కనిపించాలని.. తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్య పట్ల నమ్మకం కల్పించిన ఉపాధ్యాయులే ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దే రథసారధులు అని ఆయన అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
