మాజీ ఈసీ నిమ్మగడ్డకు హైకోర్టులో ఊరట

మాజీ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వం తెచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. నిమ్మగడ్డ రమేష్‌ను కమిషనర్‌గా కొనసాగించాలని హైకోర్టు తీర్పు వెల్లడించింది.

మాజీ ఈసీ నిమ్మగడ్డకు హైకోర్టులో ఊరట
Follow us

|

Updated on: May 29, 2020 | 3:17 PM

ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంపై కీలక తీర్పు వెలువరించిన హైకోర్టు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ రద్దు చేసింది.. రమేశ్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితులలో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్షణం నుంచే రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా కొనసాగుతారని ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కమిషనర్ గా కనగరాజ్ కొనసాగడానికి వీలులేదని కోర్టు స్పష్టం చేసింది..

ఎస్ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ ఏపీ సర్కార్ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన సంగతి తెలిసింది.. దీనికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. తర్వాత రాష్ట్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపింది. వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం మూడేళ్లు గడచిందని పేర్కొంటూ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. న్యాయ శాఖ జీవో 31, పంచాయతీరాజ్ శాఖ 617, 618 జీవోలు ఇచ్చాయి. దీంతో ఎస్‌ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత జస్టిస్ కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా నియమించారు. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలు మార్చి తనను పదవి నుంచి తొలగించారని అన్నారు. అలాగే టీడీపీ తరపున వర్ల రామయ్య, బీజేపీ తరపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరికొంతమంది కూడా పిటిషన్లు వేయగా.. కోర్టు అన్ని పిటిషన్లు కలిపి విచారణ చేసింది.