Andhra News: ఏపీలో భారీ వర్షాలు, వరదలు.. వారికి రూ.4లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రాబాబు
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వర్షాలేవి లేవని.. కానీ ఇప్పటివరకు కురిసిన వర్షాల కారణంగా నలుగురు మృతి చెందినట్టు అధికారులు చెప్పగా.. బాధిత కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిస్థితులను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గొట్టా బ్యారేజ్ క్యాచ్ మెంట్లో 33 టీఎంసీలు, తోటపల్లి పరిధిలో 11 టీఎంసీలు మేర వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. గొట్టా బ్యారేజికి 1.89 లక్షల క్యూసెక్కులు, తోటపల్లికి 44 వేల క్యూసెక్కుల వరద వస్తోందని శ్రీకాకుళం కలెక్టర్ తెలిపారు. ఒడిస్సాల్లోని ప్రాంతాల్లో పడిన భారీ వర్షాల కారణంగా వంశధారకు 1.05 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని వివరించారు.
ఇప్పటి వరకు భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా నలుగురు మృతి చెందినట్లు సీఎం చంద్రబాబుకు తెలిపారు అధికారులు. విశాఖ నగరం కంచరపాలెం లో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఒకరు మృతి చెందినట్లు చెప్పుకొచ్చారు. దీనిపై స్పందించిన సీఎం బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షం లేదని.. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో నదుల్లో వరద ఉందని అధికారులు సీఎంకు వివరించారు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల చెట్లు కూలాయని.. ఇప్పటికే 90 శాతం కూలిన చెట్లను తొలగించామని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు 90 శాతం మేర విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్టు ఈపీడీసీఎల్ అధికారులు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం లోగా అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్ పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్దరణలో ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
